నీలగిరి, ఏప్రిల్ 30 : తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 11,239 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 11,128 మంది హాజరయ్యారు. 111 మంది గైర్హాజరయ్యారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించడంతో అభ్యర్థులు సరైన సమయానికే పరీక్ష కేంద్రాలకు చెరుకున్నారు.
పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు పరిశీలించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి సీఐ స్థాయి అధికారిని నియమించడంతో పాటు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పట్టణంలోని జిరాక్స్, నెట్ సెంటర్లను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
బస్టాండ్లో సందడి
కానిస్టేబుల్ తుది పరీక్ష, గురుకులాల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి కూడా ఆదివారం పరీక్ష నిర్వహించడంతో అభ్యర్థులు, విద్యార్థులు అధిక సంఖ్యలో జిల్లా కేంద్రానికి వచ్చారు. పరీక్ష ముగిసిన అనంతరం సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకోగా రద్దీ ఏర్పడింది. ఆర్టీసీ అధికారులు రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించారు. పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాల వద్ద టిఫిన్ సెంటర్లు కూడా రద్దీగా దర్శనమిచ్చాయి.