నీలగిరి, మార్చి 1 : సీసీ కెమెరాలతో నేర నియంత్రణ, అసాంఘీక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎస్పీ అపూర్వరావు సూచించారు. ఎస్పీ కార్యాలయంలో సామాజిక భద్రత(సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ)పై వివిధ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలతో బుధవారం నిర్వహించిన సమావేవంలో ఆమె మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. వీటిని ప్రతి ప్రాంతంలోనూ ఏర్పాటు చేయడంతో నేర రహిత సమాజాన్ని నిర్మించవచ్చన్నారు. అనేక కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తున్నాయని తెలిపారు. వీటి ద్వారా నిందితులను గుర్తించడం చాలా సులువు అవుతుందన్నారు. పోలీస్ శాఖ తీసుకుంటున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తూ ప్రతి గ్రామం, పట్టణం, రహదారి కూడలి, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్త రాజేంద్రప్రసాద్ లక్ష రుపాయల చెక్ను ఎస్పీకి అందించగా అభినందించారు. సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, సీఐ రాఘవేందర్, ఆర్ఐ సంతోష్, నాట్కో ప్రతినిధి రాజ్కుమార్, రైస్మిల్ అసోసియేషన్ ప్రతినిధి రాజేంద్రప్రసాద్, పారిశ్రామిక వేత్తలు శ్రీనివాస్, వెంకటరమణ, నవీన్రెడ్డి, ఏకే.సింగ్, సుధీర్రెడ్డి, మధుకుమార్ పాల్గొన్నారు.
ఆటోల్లో పరిమితికి మించి తరలించవద్దు
ఆటోల్లో పరిమితికి మించి బడి పిల్లలను, ప్రయాణికులను తీసుకెళ్తే చర్యలు తప్పవని ఎస్పీ అపూర్వరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. పరిమితికి మించి ప్రయాణికులు, విద్యార్థులను తీసుకెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తామని తెలిపారు. వాహనదారులు డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.