పెద్దవూర, ఫిబ్రవరి 18 : మండలంలోని చింతపల్లి గ్రామంలో మహాశివరాత్రి, దున్న ఇద్దాసు ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. దేశంలోని 18 రాష్ర్టాల జట్లు పోటీలో పాల్గొనగా విజేతగా సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు నిలిచింది. శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ సెంట్రల్ రైల్వే -హర్యాన(అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ) జట్లు పోటీ పడ్డాయి. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు ఐదు పాయింట్ల తేడాతో విజేతగా నిలిచి మొదటి బహుమతి(లక్ష రూపాయలు)గెలుచుకుంది.
హర్యాన(అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ) రెండో బహుమతి(రూ.80వేలు), మూడో బహుమతి (రూ.60వేలు) ఢిల్లీ, నాలుగో బహుమతి (రూ.50వేలు) తమిళనాడు, ఐదో బహుమతి(రూ.40 వేలు) వెస్ట్ బెంగల్, ఆరో బహుమతి(రూ.30వేలు) కర్ణాటక, ఏడో బహుమతి(రూ.25వేలు) తెలంగాణ జట్టు, ఎనిమిదో బహుమతి(రూ.20వేలు) ఉత్తరాఖండ్, తొమ్మిదో బహుమతి(రూ.15వేలు) ఆంధ్రప్రదేశ్ మిషన్, పదో బహుమతి(రూ.10వేలు) అమరజ్యోతి (హర్యాన) గెలుచుకున్నాయి. విజేతలకు నిర్వాహకులు నగదుతో పాటటు ట్రోఫీని అందించారు.
పోటీలను సాయంత్రం నుంచి రాత్రి వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో నిర్వహించారు. కబడ్డీ పోటీలను చూసేందుకు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నాగార్జునసాగర్ సీఐ కె.నాగరాజు, పెద్దవూర ఎస్ఐ పచ్చిపాల పరమేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జి.కర్తయ్య, జిల్లా గౌరవాధ్యక్షుడు గార్లపాటి శేఖర్, అధ్యక్షుడు భూలోకరావు, ఆలయ కమిటీ చైర్మన్ షేక్ అబ్బాస్, గ్రామ సర్పంచ్ సుంకిరెడ్డి ప్రభావతీ సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ భారతీకొండల్, ఎంపీటీసీ జటావత్ జ్యోతీకృష్ణ, నాయకులు సుంకిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గ్గొన్నారు.