తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ ఉద్యోగాలకు పేద కుటుంబాలకు చెందిన పలువురు యువకులు ఎంపికయ్యారు. స్వరాష్ట్రంలో పైరవీలు, అక్రమాలకు తావు లేకుండా చేపట్టిన రిక్రూట్మెంట్లో సర్కారు కొలువులు సాధించి సత్తా చాటారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి ఫిజికల్ టెస్టులు, రాత పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడి ఇలా అన్ని దశల్లోనూ పూర్తి పారదర్శకతతో వ్యవహరించడంతో ఎంతోమంది నిరుపేదలకు సర్కారు కొలువులు దక్కాయి. పైసా ఖర్చు పెట్టకుండా, ఎవరి జోక్యం లేకుండా సాధించిన ఉద్యోగాలతో ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లువిరుస్తున్నది.
రామగిరి, ఆగస్టు 9 : పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కష్టమైనా ఇష్టంతో సాధించవచ్చనే నానుడిని నిజం చేశాడు రిక్షా కార్మికుడి కుమారుడు. తెలంగాణ సర్కారు ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ ఉద్యోగల భర్తీ ఫలితాలల్లో సత్తాచాటి తల్లిదండ్రుల కష్టానికి దర్పణంగా నిలిచాడు. అతడే నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన పల్లెబోయిన శంకర్. ఉమ్మడి రాష్ట్రంలో తన అన్న పీజీ, బీఈడీ పూర్తిచేసినా సర్కారు కొలువు రాలేదు. అయితే ఇంట్లో అమ్మానాన్న, అన్న పడే కష్టం చూసి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తప్పనతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో పీజీ సీటు వచ్చినా ఉద్యోగసాధనే లక్ష్యంగా చదివి బెటాలియన్ ఐఎస్గా ఉద్యోగం సాధించిన శంకర్ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. స్వరాష్ట్రంలో పారదర్శకంగా ఫలితాలు విడుదల చేసి ఉద్యోగం అందించడంపై హర్షం వ్యక్తం చేసి సీఎం కేసీఆర్ సర్కార్కు కృతజ్ఞతలు తెలిపాడు.
శంకర్ కుటుంబ జీవితం, చదువు..
నల్లగొండలోని శ్రీనగర్కాలనీకి చెందిన పల్లెబోయిన వెంకన్న, లింగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె. తన పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తండ్రి రిక్షా తొక్కగా, తల్లి ఇండ్లళ్లో పనిచేసి పిల్లలను చదివించారు. దాంతో పెద్దకొడుకు ఉమ్మడి రాష్ట్రంలో పీజీ, బీఈడీ చేసి ఉద్యోగం రాకపోవడంతో సొంతంగా ఆప్టికల్స్ షాపు పెట్టి కుటుంబానికి అండగా నిలిచి చెల్లి, తమ్ముడిని చదివించాడు. శంకర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ కాలనీలోని విజ్ఞాన జ్యోతి పాఠశాలలో శిశు నుంచి పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్ విద్వాన్ జూనియర్ కళాశాలలో చదువగా, డిగ్రీ ఎన్జీ కళాశాలలో 2015-18లో పూర్తి చేశాడు. అదే సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో పీజీ సీటు వచ్చినప్పటికీ ఉద్యోగ సాధనలో భాగంగా సీటు వదిలేసి చదువడం ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలో కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయినప్పటికీ మొక్కవోని దీక్షతో మళ్లీ ఉద్యోగ సాధన కోసం సిద్ధమై ఆదివారం విడుదలైన ఫలితాల్లో బెటాలియన్ ఎస్ఐ ఉద్యోగం సాధించాడు. మే, 2023లో ఆర్ఆర్బీ గ్రూప్-డీ ఉద్యోగం వచ్చినప్పటికీ రాష్ట్ర సర్కారు నిర్వహించిన పోలీస్ కొలువు చేయాలని దాన్ని వదిలివేశాడు.
పారదర్శకంగా ఫలితాలు విడుదల చేసిన సర్కారుకు కృతజ్ఞతలు
అమ్మ, నాన్న, అన్నయ్య పడే కష్టం చూసి బాధపడేవాణ్ని, అన్నయ్య పీజీ, బీఈడీ చేసినా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగం రాలేదు. స్వరాష్ట్రంలో ఉద్యోగల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇవ్వడంతోపాటు నిష్పాక్షికంగా, అక్రమాలకు తావులేకుండా ఉద్యోగలు భర్తీ చేసింది. ఉద్యోగ సాధనలో నేను ప్రత్యేక ప్రణాళికతో చదివా. అయితే ఆదివారం వెల్లడైన ఎస్ఐ ఫలితాల్లో బెటాలియన్ ఎస్ఐగా ఎంపికవడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వడంతోపాటు త్వరితగతిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం అభినందనీయం. ప్రభుత్వనికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. -పల్లెబోయిన శంకర్
చింతలపాలెం మండలం నుంచి ఇద్దరు..
చింతలపాలెం, ఆగస్టు 9 : మండలం కేంద్రానికి చెందిన గంగిరెడ్డి విజయ భాస్కర్రెడ్డి, యర్రకుంటతండాకు చెందిన వాంకుడోతు నాగేశ్వర్రావు అనే ఇద్దరు యువకులు ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఐలుగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇరువురు యువకులు ఎస్ఐలుగా ఎంపికై తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. దాంతో వారి కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇరువురు యువకులకు ఆయా గ్రామాల పెద్దలు అభినందనలు తెలిపారు.
మేస్త్రీ కూతురు సివిల్ఎస్ఐ
వేములపల్లి, ఆగస్టు 9 : మండలంలోని సల్కునూరు గ్రామానికి చెందిన అంకెపాక తేజస్విని ఆదివారం విడుదలైన ఎస్ఐ ఫలితాల్లో సివిల్ ఎస్ఐగా ఎంపికైంది. తేజస్విని తల్లిదండ్రులు అంకెపాక బాబు సుతారి మేస్త్రిగా పని చేస్తుండగా, తల్లి రాణి వీఓఏగా విధులు నిర్వహిస్తున్నది. పాఠశాల విద్యను సల్కునూరు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన తేజస్విని ప్రస్తుతం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ చదువుతూ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఎస్ఐ కొలువు సాధించింది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం వేసిన నోటిఫికేషన్ను సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఎస్ఐ సాధించినట్లు తేజస్విని తెలిపింది. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. తేజస్విని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
కానిస్టేబుల్ నుంచి సివిల్ ఎస్ఐగా..
గుర్రంపోడు, ఆగస్టు 9 : మండలంలోని పిట్టలగూడెం గ్రామానికి చెందిన తూటిపల్లి అజయ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తూటిపల్లి సత్తెమ్మ, మల్లయ్య దంపతుల కుమారుడైన అజయ్ 2016లో పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం హైదారాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా పని చేస్తూనే రెండో ప్రయత్నంలో సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఎస్ఐగా ఎంపికైన అజయ్ను గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు.