యాదగిరిగుట్ట రూరల్, మార్చి 17 వాహన ఫిట్నెస్.. పర్మిట్.. రోడ్డు ట్యాక్స్.. ఇన్సూరెన్స్.. చలాన్లు ఇలా రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్నులను చెల్లించకుండా కొందరు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలు కొనసాగిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి వంద శాతం వసూళ్లే లక్ష్యంగా రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఎకడికకడ వాహనాల తనిఖీలు చేపట్టి పన్ను బకాయిలు ఉన్న వాహన యజమానులకు 200 శాతం జరిమానా విధిస్తున్నారు.
పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడితే మాత్రం అధికారులు 200 శాతం మేర జరిమానా విధిస్తున్నారు. కాల పరిమితి దాటిన వాహన యజమానులకు ఇప్పటికే వ్యక్తిగత ఫోన్ నంబర్లకు మెసేజ్ల రూపంలో సమాచారం అందించారు. పన్నులు చెల్లించకుండా రోడ్డుపై అధికంగా తిరిగే వాటిలో లారీలు, బస్సులు, డీసీఎంలు, గూడ్స్ వాహనాలే ఉన్నాయి. ఈ నెల చివరి నాటికి ట్యాక్స్లు చెల్లించని వాహనాలపై కొరడా ఝుళిపించనున్నారు.
పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపించడం చట్టరీత్యా నేరం. కావున వాహన సకాలంలో పన్నులు చెల్లించి అధికారులకు సహకరించాలి. తద్వారా అదనపు జరిమానాల పడకుండా ఉండొచ్చు. తనిఖీల్లో పట్టుబడిన వారికి 200 శాతం జరిమానా విధిస్తున్నాం. ఇప్పటి వరకు 363 వాహనాలను సీజ్ చేశాం.
– సురేందర్రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి
త్రైమాసిక పన్నులు.. చలాన్లు చెల్లించకుండా రోడ్డుపై తిరుగుతున్న వాహనాలకు కళ్లెం వేసేందుకు జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జిల్లాలో ఇలాంటి 363 వాహనాలను సీజ్ చేసి రూ.78.13 లక్షలు పన్నుల రూపంలో వసూలు చేశారు. 6,859 కమర్షియల్ వాహనాల నుంచి ట్యాక్సులు వసూలు చేయాల్సి ఉందని గుర్తించారు. మొత్తం బకాయిలు రూ.7.43 కోట్లు వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.