రామగిరి, డిసెంబర్ 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా బీజేపేతర రాష్ట్ర ప్రభుత్వాలను భయభ్రాంతులకు గురిచేస్తుందని, అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7న సీపీఐ ఆధ్వర్యంలో రాజ్భవన్ను ముట్టడించనున్నట్లు ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి తెలిపారు. నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల ద్వారా ఎన్నికైనా రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను కొంత మంది గవర్నర్లు ముందుకు తీసుకుపోతున్నారని ఆరోపించారు.
రాష్ర్టాల్లో స్వతంత్రంగా నిర్వహించావాల్సిన సంస్థలను నిర్వీర్యం చేస్తూ వారి చెప్పుచేతల్లో పెట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న రాష్ర్టాల మీదికి ఉసిగొల్పుతున్నారని అన్నారు. ఆయా ప్రభుత్వాలను భయపెట్టి తమ వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆఖరికి గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీలో చేసిన నిర్ణయాలను ఆమోదించకుండా నెలల తరబడి బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ రాజుభవన్లో పెండింగ్లో పెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కోసం ఈడీ, సీబీఐతో బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లి కంటి సత్యం మాట్లాడుతూ ఈ నెల 26న పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ జెండాలు ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఉజ్జిని రత్నాకర్రావు, పల్లా నర్సింహారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్రెడ్డి, శ్రవణ్కుమార్, వీరస్వామి పాల్గొన్నారు.