డెకాయ్ ఆపరేషన్లతో పోకిరీల భరతం..
మెట్రో రైలులో రోజుకు 2.. రోడ్లపై 21 సార్లు
నెలలో 630 డెకాయ్ ఆపరేషన్లు
మహిళల భద్రత కోసం రాచకొండ షీ టీమ్స్
మహిళల భద్రత కోసం రాచకొండ షీ టీమ్స్ ప్రతి రోజూ 21 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.81 హాట్ స్పాట్లలో 7 షీ టీమ్స్ బృందాలు మహిళల రక్షణకు నిరంతరం గస్తీని నిర్వహిస్తున్నాయి. కాలేజీలు, ట్యుటోరియల్స్, షాపింగ్ మాల్స్, రద్దీ మార్కెట్లు, బస్ స్టాప్లు, ఇలా పోలీసులు ఓ ప్రణాళికా బద్ధంగా హాట్ స్పాట్స్ను ఎంచుకుంటున్నారు. రోజూ ఒకే చోట కాకుండా మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులు, సాధారణ మహిళల రాకపోకలు, ఇతర పనులపై వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకుని షీ టీమ్స్ ఒక రోజులో సమయాలను విశ్లేషించుకుని వాటికి అనుగుణంగా డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తున్నారు.
సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ) : ఒక వైపు డెకాయ్ ఆపరేషన్లను నిర్వహిస్తూనే రాచకొండ
షీ టీమ్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు, నేరుగా పరిష్కరిస్తున్నాయి. మెట్రో రైలులో కూడా రోజూ రెండు సార్లు డెకాయ్ ఆపరేషన్లను షీ టీమ్స్ జరుపుతున్నాయి. పోకిరీలను షాడోలాగా షీ టీమ్స్ వెంటాడుతున్నాయి. మరో వైపు మహిళలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతాలలో ప్రత్యేక దృష్టిని పెట్టారు. రోజు ప్లాన్లో భాగంగా రాచకొండ పరిధిలో మహిళల రక్షణకు 7 బృందాలు, దాదాపు 33 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా రోడ్లపై జనం మధ్యలో నిలబడుతున్నారు. ఇలా ప్రతి నెలా 200 మంది పోకిరీలు ప్రత్యక్షంగా దొరికిపోతున్నారు. వారందరికీ కౌన్సెలింగ్తో పాటు వార్నింగ్లను ఇస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఇప్పుడు దాదాపు అన్ని హాట్స్పాట్లలో పోకిరీల ఈవ్టీజింగ్ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. నమోదవుతున్న ఫిర్యాదులే ఇందుకు కొలమానం.
డెకాయ్ ఆపరేషన్లో పట్టుబడిన పోకిరీల వీడియోలు, ఫొటోలు, వారి ఫోన్ నంబర్లు, ధ్రువీకరణ పత్రాలన్నింటినీ ఒక డేటాలో పెట్టడంతో రెండోసారి పట్టుబడితే ఒక క్లిక్ పోకిరీల పాత చరిత్ర పోలీసులకు వారి ట్యాబ్, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్ స్క్రీన్ల మీద ప్రత్యక్షంగా కనపడే విధంగా టెక్నాలజీ ఏర్పాటు చేసుకున్నారు. రిపీట్ అని తెలిస్తే తదుపరి చర్య చట్టపరంగా చాలా కఠినంగా ఉంటుందని షీ టీమ్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
4 నెలలు.. 423 ఫిర్యాదులు
57 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు
పట్టుబడ్డ వారికి జైలు శిక్షలు
షీ టీమ్స్కు తెలియజేయండి
అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్
ఈ ఏడాది 4 నెలల్లో హైదరాబాద్ షీ టీమ్స్కు 423 ఫిర్యాదులు అందాయని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు షీ టీమ్స్లో నమోదైన కేసుల వివరాలు వివరించారు. 203 మంది ఫిర్యాదుదారులు నేరుగా, 181 మంది 9490616555 వాట్సాప్ నంబర్, మిగతా వారు ఇతర సోషల్మీడియా ఫ్లాట్ ఫామ్ల ద్వారా షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇందులో 57 కేసులు ఆయా పోలీస్స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, 25 ఫిర్యాదులపై పెట్టీ కేసులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిని రెడ్ హ్యాడెండ్గా పట్టుకొని 15 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశామని చెప్పారు. 191 మంది మేజర్లు, 23 మైనర్లను హెచ్చరించి వారికి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు అదనపు సీపీ వెల్లడించారు. వేధింపులపై నిశబ్దంగా ఉండవద్దని, షీ టీమ్స్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని మహిళలకు అదనపు సీపీ సూచించారు.