గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 143 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా 99 కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చింది. ఎంబీబీఎస్ డాక్టర్లతోపాటు స్టాఫ్ నర్సులను నియమించి నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసింది. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఉచితంగా మందులు అందిస్తున్నది. వారికి టెలీ మెడిసిన్ సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందుతుండగా పట్టణ ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఎంతో ప్రయోజనం కలుగుతున్నది. వృద్ధులు, మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పల్లె దవాఖానలతో గ్రామీణ ప్రాంతాలకు మంచిరోజులు వచ్చాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యూట్రీషన్ కిట్, ఐరన్, పోలిక్ ఆసిడ్, కాలుష్యం, కిలో నెయ్యి, షుగర్, బీపీ తదితర మందులతో కూడిన కేసీఆర్ డిజిటల్ కిట్స్ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండడంతో గ్రామీణ ప్రజానీకం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఎంబీబీఎస్ వైద్యుడి సేవలతో ప్రభుత్వ దవాఖాన వస్తుందని కలలో కూడా ఊహించలేదని, రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
– చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 30
యాదాద్రి భువనగిరి జిల్లాలో 5వేల మందికి ఒకటి చొప్పన మొత్తం 143 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. పల్లె ప్రజలకు ఆరోగ్య సేవలు ఆందుబాటులో ఉంచాలని సంకల్పించిన ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పల్లెల్లో 99 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చింది. వీటిలో 27 మంది ఎంబీబీఎస్ వైద్యులను, 39 మంది బీఏఎంఎస్ వైద్యులను, 33 మంది స్టాఫ్ నర్సులను నియమించింది. ప్రతి దవాఖానలో ఒక ఎంబీబీఎస్ డాక్టరు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశా వర్కర్లను నియమించి ప్రభుత్వం పల్లెఓ ప్రజలకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్య సేవలు అందిస్తున్నది. బీపీ, షుగర్ పరీక్షలు చేసి ఉచితంగా రోగులకు మందులు అందిస్తున్నారు. గ్రామాల్లో టెలీ మెడిసిన్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వైద్యసిబ్బంది వైద్య సేవలతోపాటు ప్రతి శుక్రవారం గ్రామాల్లో తిరుగుతూ గ్రామ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి శనివారం శివారు గ్రామాలకు సైతం వెళ్లి అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.
చదువు పూర్తయిన వెంటనే చిన్నకొండూరు గ్రామంలో ప్రభుత్వ పోస్టింగ్ వచ్చింది. గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు సేవలు అందుతాయి. వైద్యులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామంలో వైద్యసేవలతోపాటు పరిసరాల పరిశుభ్రతపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ కిట్ ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది.
-డాక్టర్ మాంకాల నరేశ్, చిన్నకొండూరు పల్లె దవాఖాన వైద్యుడు
ఊర్లోనే ఆసుపత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరం. ఈ ఆస్పత్రి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి చిన్న రోగానికి చౌటుప్పల్ పోయే పని తప్పింది. అక్కడికి పోతే వెయ్యి రూపాయలు అయ్యేది. ఇప్పుడు ఇక్కడే పరీక్షలు చేస్తున్నరు. మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. రోజూ వేసుకోవాల్సిన బీపీ, షుగర్ మందులను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది.
-తీగుళ్ల రామచంద్రయ్య, చిన్నకొండూరు