అడ్డగూడూరు, డిసెంబర్ 24 : మారుతున్న కాలానికనుగుణంగా ప్రపంచమంతా అరచేతిలోకి వచ్చేసింది. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లతో ఇంటి వద్ద నుంచే అనేక రకాల సేవలు పొందడంతోపాటు ప్రపంచంలోని పలు విషయాలను తెలుసుకోవచ్చు. వీక్షించవచ్చు. పౌర సేవలను సైతం సులభంగా పొందే వీలుంది. అయితే.. అవగాహన లోపంతో చాలా మంది మీసేవ, సర్వీస్ సెంటర్లు, దళారులను ఆశ్రయించి జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. కొంచెం అవగాహన పెంచుకుంటే అనేక సేవలను తక్కువ ఖర్చుతో సులభంగా పొందడంతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
మీ సేవ కేంద్రాల్లో చేసే ప్రతి దరఖాస్తునూ ఇంట్లోనే చేసుకోవచ్చు. టీఎస్, మీ సేవ అని గూగుల్లో సెర్చ్ చేసి ముందుగా సిటిజన్ లాగిన్ పొందితే చాలు. సిటిజన్ లాగిన్కు కేవలం ఫోన్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఉంటే సరిపోతుంది. కులం, ఆదాయం, నివాస సర్టిఫికెట్ల నుంచి ప్రతిదీ దరఖాస్తు చేసుకోవచ్చు. చేసిన తర్వాత వచ్చిన రసీదు నెంబరుతో మీసేవ కేంద్రాల్లో ప్రింట్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డుతో పాటు పాన్కార్డు తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో కంప్యూటర్ లేదా స్మార్ఫోన్లో నుంచి పాన్కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. https//www.onlineservices.nsdl. com/ paam/end UserRegisterContact.html వెబ్సైట్లో ఆధార్ నెంబర్, వివరాలను ఎంటర్ చేస్తే పది రోజుల్లో పాన్కార్డు ఇంటికి వస్తుంది. ఆధార్ కార్డుకు కేవైసీ ఉంటే గంటలోనే ఈ-మెయిల్కు పాన్కార్డు కాపీ వస్తుంది.
ఇందుకోసం 107 రూపాయలు యూపీఐ ద్వారా గానీ, బ్యాంక్ ద్వారా గానీ చెల్లించాలి. దీనిపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాల్లో రూ.150నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https//telanganaepass.cgg.gov.in / kalyanaLakshmiLimks.do వెబ్సైట్లో ఎలాంటి రుసుము లేకుండా సేవలు పొందవచ్చు. దరఖాస్తు ఫారం, అప్లోడ్ చేసిన వాటికి సంబంధించిన జిరాక్స్ ప్రతులను తాసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలి. చాలా మందికి అవగాహన లేక ఇంటర్నెట్ కేంద్రాల్లో అధిక డబ్బు చెల్లిస్తున్నారు.