దేవరకొండ, అక్టోబర్ 11 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేతావత్ బీల్యానాయక్ బీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. దేవరకొండ నియోజకవర్గం నుంచి సుమారు 3 వేల మంది ఈ చేరికల కార్యక్రమానికి తరలివెళ్లారు. భారీగా హాజరైన నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యాలయం సందడిగా మారింది.
ఈలలు, కేరింతలతో హోరెత్తింది. మంత్రుల వెంట ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని, డిండి ఎత్తిపోతల పూర్తి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అత్యధికంగా మెజార్టీ ఇచ్చి గులాబీ జెండాఎగుర వేస్తామని బీల్యానాయక్ తెలిపారు.