యాదాద్రి, డిసెంబర్ 30 : యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఆలయ ఈఓ ఎన్.గీత, భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.కోటి వెచ్చించి కొండపైన, రింగ్రోడ్డు చుట్టూ, ప్రెసిడెన్సియల్ సూట్, యాదాద్రి- రాయగిరి ప్రధాన రోడ్డుకు బిగించిన సీసీ కెమెరాలను కొండపైన కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసినట్లు తెలిపారు.
త్వరలో ఈ కెమెరాలను బంజారాహిల్స్లోని రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానానికి ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. సీసీ కెమెరాలు యాదాద్రి ఆలయ ప్రాంగణం, ఘాట్ రోడ్లు, ప్రెసిడెన్సియల్ విల్లా, యాగశాల, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపం, సీఆర్ఓ, బస్టాండ్, గండి చెరువు ప్రాంతాల్లో దృశ్యాలను ఎప్పటికప్పుడు బంధిస్తాయన్నారు. ఆలయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే సీసీ కెమెరాలు పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయన్నారు. అనంతరం ఐటీ సిబ్బంది, సీపీని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యాదాద్రి ఏసీపీ నరసింహారెడ్డి, సీఐ సైదయ్య, రాచకొండ ఐటీ సెల్ విభాగం అధిపతి శ్రీధర్రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు.
హైవే 65పై ఉచిత అంబులెన్స్ సేవలు
కట్టంగూర్, డిసెంబర్ 30 : హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారిపై హైదరాబాద్ మలక్పేట యశోద ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతి రోజూ 24గంటలు ఉచితంగా సేవలు అందించేందుకు అంబులెన్స్ సర్వీసులను ఒకటి చిట్యాల మండలం గుండ్రాంపల్లి, మరోటి కట్టంగూర్లో అందుబాటులో ఉంచామని ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక వెంటిలెటర్ సౌకర్యంతో పాటు ఫస్ట్ ఎయిడ్, కేర్ టేకర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవల కోసం 105910 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని సూచించారు.