నేడు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం
చైర్మన్, వైస్ చైర్మన్ చాంబర్లు, మీటింగ్, వెయిటింగ్ హాళ్ల ఏర్పాటు
ల్యాండ్ ఫూలింగ్ కోసం 350 ఎకరాల గుర్తింపు
కొత్తపల్లిలో 50 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు
శ్రీవల్లి టౌన్షిప్ ప్లాట్ల అమ్మకానికి రెండో ప్రీ బిడ్ సమావేశం
పలు అంశాలపై స్పష్టతనిచ్చిన నుడా చైర్మన్ పీజే పాటిల్
నీలగిరి, ఫిబ్రవరి 25 : నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)లో మరో కీలక ముందడుగు పడుతున్నది. సమగ్రాభివృద్ధే ధ్యేయంగా గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీతోపాటు నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల పరిధిలో నుడాను ఏర్పాటు చేసి, కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నుడా కార్యకలాపాలు మున్సిపల్ కార్యాలయం నుంచే సాగగా, తాజాగా ఇదే ఆఫీసులోని ఫస్ట్ ఫ్లోర్లో ప్రత్యేకంగా కార్యాలయాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ చాంబర్లు, సమావేశ మందిరం, వెయింటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు. నుడా చైర్మన్గా వ్యవహరిస్తున్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ శనివారం ప్రారంభించనున్నారు. ఆ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు నిధుల సమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్లో భాగంగా 350 ఎకరాలను అభివృద్ధి చేసేందుకు గుర్తించగా, నల్లగొండ మండలంలోని కొత్తపల్లి గ్రామ రైతులు 50 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. శ్రీవల్లి టౌన్షిప్లో 240 ప్లాట్ల అమ్మకానికి వచ్చే నెల 14 నుంచి వేలం ఉండగా, కలెక్టర్ పీజే పాటిల్ శుక్రవారం బిల్డర్లు, ప్రజలతో ప్రీబిడ్ సమావేశంనిర్వహించి, పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.
నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) అడుగులు ఒక్కొక్కటిగా ముందుకు పడుతున్నాయి. గత నెలలో నుడాతో పాటు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 20 రోజుల క్రితం కమిటీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమై నుడాపై చర్చించింది. రాజీవ్ స్వగృహాలోని భూములను శ్రీవల్లి టౌన్షిప్ పేరుతో ప్లాట్లుగా మార్చారు. దీనిని అభివృద్ధి చేసి జిల్లా ప్రజలకు నమూనాగా చూపించనున్నారు. నుడా చేపట్టే అభివృద్ధికి 350 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నల్లగొండ మం డలం కొత్తపల్లి గ్రామ రైతులు తమ భూములను నుడాకు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. మిగిలిన గ్రామాల్లో ప్రభుత్వ యం త్రాంగం, ప్రజాప్రతినిధుల సహకారంతో భూ ములు సేకరించేందుకు ప్రయత్నాలు చేపట్టారు.
ముందుకొచ్చిన కొత్తపల్లి గ్రామ రైతాంగం..
ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా భూమిని తీసుకుని అభివృద్ధి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైతులు ఇచ్చిన భూముల్లో రోడ్లు, డ్రైనేజీ, మైదానాలు, పార్కులు, విద్యుత్ వంటి సౌకర్యాలతో లే అవుట్లు చేయనున్నారు. ఇప్పటికే కొత్తపల్లి గ్రామ రైతులు 50 ఎకరాలు అప్పగించేందుకు ముందుకు వచ్చారు.
350 ఎకరాల్లో భూముల అభివృద్ధికి ప్రతిపాదనలు..
నుడాను నల్లగొండ, తిప్పర్తి, కనగల్, కట్టంగూర్, నకిరేకల్, నార్కట్పల్లి మండలాల పరిధిలో ఏర్పాటు చేశారు. ముందుగా భూమి విలువ ఉన్న ప్రాంతాల్లో సేకరించి అభివృద్ధ్ది చేయాలని నిర్ణయించారు. కొత్తపల్లి గ్రామంలో 50 ఎకరాలు, దండెంపల్లి గ్రామంలో 100 ఎకరాలు, అన్నెపర్తిలో 100 ఎకరాలు, ఎల్లారెడ్డిగూడెం, చెర్వుగట్టు పిట్టంపల్లి గ్రామాల సరిహద్దుల్లో మరో 100 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ స్కీంలో తీసుకునేందుకు అధికారులు పరిశీలించారు. పట్టా, ప్రభుత్వ, లావునీ పట్టా భూముల సేకరణ బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దాంతో రంగంలోకి దిగి ఆయా గ్రామాల రైతులతో చర్చలు జరుపుతున్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఇస్తే భూములు అప్పగించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
నుడా కార్యాలయ
ప్రారంభానికి ఏర్పాట్లు
నల్లగొండ మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కలెక్టర్, నుడా చైర్మన్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వస్తుండడంతో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి అన్ని రకాల వసతులతో చైర్మన్, వైస్ చైర్మన్ చాంబర్లను, వెయిటింగ్ హాల్ను ఏర్పాటు చేశాం. నుడాలో భూములను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు.
– డాక్టర్ కేవీరమణాచారి, మున్సిపల్ కమిషనర్, నుడా వైస్ చైర్మన్