గరిడేపల్లి, జనవరి 2 : అన్ని వృత్తుల్లోకెల్లా ఆదర్శప్రాయమైనది ఉపాధ్యాయ వృత్తి. చాలా మంది దీనిని ప్రభుత్వ ఉద్యోగంగా మాత్రమే భావించి నెల వేతనం కోసం బాధ్యతలు నెరవేర్చుతారు. కానీ, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనానికి ప్రాధాన్యతమిస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికితీసి మరింత పదును పెట్టే ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా అరుదు. విద్యార్థులకు అర్థవంతంగా బోధిస్తూ వారితో తగిన ప్రయోగాలు చేయిస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీస్తూ ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయిని మారం పవిత్ర. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. ఇప్పుడు భారత ప్రభుత్వం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 20 వరకు నిర్వహించే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ఎడ్యుకేషన్ ఫర్ ఆస్పైరింగ్ ఇండియా, నేషనల్ సైన్స్ టీచర్స్ వర్క్షాప్కు ఆహ్వానం అందుకున్నారు.
బోధనలో ప్రత్యేక విధానం..
2008లో డీఎస్సీ ద్వారా బయోసైన్స్ ఉపాధ్యాయురాలిగా పవిత్ర ఉద్యోగం సాధించారు. మొదట ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం యూపీఎస్లో ఉపాధ్యాయురాలిగా విధులు చేపట్టారు. 2012 నుంచి 2015 వరకు గోరెంట్ల జడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా, 2015 నుంచి గడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల రూపకల్పనలు..
వరి పొలాల్లో రైతులు వరాలు తీయడానికి పడే కష్టానికి పరిష్కారం చూపడం, నీటిపై తేలే చెత్తను తొలగించడానికి ఉపయోగించే పరికరం, ఎకోఫ్రెండ్లీ రాఖీల తయారీ, మొక్కలకు ఉపయోగపడే బయోటానిక్ లాంటివి ఈమె సారథ్యంలో విద్యార్థులు తయారు చేసినవే. లోహిత అనే అమ్మాయి రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ రాఖీలను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, సాయిదీపక్, వెంకటేశ్ తయారు చేసిన ఫార్మర్ ఫ్రెండ్లీ సైకిల్ను గడ్డిపల్లి కేవీకేలో ప్రదర్శించగా మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభినందించారు. ఇవే కాకుండా చాలా మంది విద్యార్థులు జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన సైన్స్ఫెయిర్లో తమ ప్రయోగాలను ప్రదర్శించారు.
ఎస్సీఈఆర్టీ వీడియోలకు సహకారం
జాతీయ స్థాయిలో సీఐఈటీ, ఎన్సీఈఆర్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 2020-21 సంవత్సరానికి గానూ ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఐసీటీ టూల్స్పై అవగాహన తరగతులు నిర్వహించారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎస్ఐఈటీ) హైదరాబాద్ ద్వారా 14 పాఠాలు బోధించారు. ఎస్సీఈఆర్టీ తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ కంటెంట్ తయారీకి ఎస్సీఈఆర్టీ, దీక్ష ఆధ్వర్యంలో 60 వీడియోలు, 16 క్వచ్చన్ సెట్లను తయారు చేశారు. పుస్తకాల్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఈ వీడియోలు చూడవచ్చు. ఓపెన్ టెన్త్ సైన్స్, టెక్నాలజీ, హోమ్ సైన్స్ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలు రాయడంలో పాలు పంచుకున్నారు.
ఐఐఎస్ఎఫ్ వర్క్షాప్కు ఎంపిక
భారత ప్రభుత్వం కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 20 వరకు ఫరీదాబాద్లో నిర్వహించే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ఎడ్యుకేషన్ ఫర్ ఆస్పైరింగ్ ఇండియా, నేషనల్ సైన్స్ టీచర్స్ వర్క్షాప్కు పవిత్ర ఎంపికైంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ నుంచి ఆహ్వానం అందుకున్నది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ర్టాల నుంచి 300 మంది సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొంటుండగా వివిధ సైన్స్ కృత్యాలపై వారికి ఆవగాహన కల్పించనున్నారు.
అందుకున్న అవార్డులు..