రామగిరి, జూన్ 12 : విద్యార్థులు వేసవి సెలవులకు స్వస్తి చెప్పి బడి బాట పట్టారు. నెలన్నర తర్వాత సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో అంతటా బడి గంటలు మోగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 4,381 పాఠశాలల్లో 5,34,502 మంది విద్యార్థులు బడిబాట పట్టారు. నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రభుత్వ పాఠశాలల ద్వారాలకు పచ్చటి తోరణాలు కట్టారు. అలాగే మన ఊరు- మనబడి, మన బస్తీ-మన బడితో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాలలు కార్పొరేట్ను తలపించేలా దర్శనమివ్వడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయగా వాటిని తీసుకొని మురిసిపోయారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తయారు చేసి లంచ్బాక్స్ రెడీ చేయడం, వారిని ఆటోలు, సైకిళ్లు, బైక్లపై తీసుకెళ్లి పాఠశాలల వద్ద దింపడం తదితర పనులతో తీరిక లేకుండా గడిపారు. పిల్లలు సైతం మొదటి రోజు కావడంతో ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్లారు.
తొలి రోజు సందడే సందడి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,381(నల్లగొండ 2,026, సూర్యాపేట 1,279, యాదాద్రి భువనగిరి 1,076) పాఠశాలల్లో తొలి రోజు విద్యార్థులు పాఠశాలలకు రావడంతో అంతా సందడి నెలకొన్నది. ఇన్ని రోజులు మూగబోయిన బడిగంట పీరియడ్ పీరియడ్కు టంగుమని మోగడంతో విద్యార్థులు అలర్ట్ అయ్యారు.