మిర్యాలగూడ, డిసెంబర్ 1 : ప్రస్తుతం సన్నధాన్యానికి మద్దతుకు మించి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో వానకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సాగునీరు అందించింది. దాంతో పాటు ఈ సీజన్లో దోమ పోటు బెడద లేక పోవడంతో ధాన్యం దిగుమతి అధికంగా వచ్చింది. వానకాలం ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి చేయడంతో మన ధాన్యానికి డిమాండ్ పెరిగింది. దాంతో కొనుగోలు దారులు మద్దతుకు మించి ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 6 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కాగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు ధాన్యం. ఈసారి సన్నరకాల్లో అంకూర పూజ, హెచ్ఎంటీ, కావేరి చింట్లు వంటి వాటిని సాగు చేసిన రైతులు వాటిని నేరుగా రైస్మిల్లుల్లో విక్రయిస్తున్నారు. దొడ్డు ధాన్యం విక్రయాలకు ప్రభుత్వం జిల్లా అంతటా ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
రైతులకు లబ్ధి
ఈ సంవత్సరం వానకాలం సీజన్లో సరైన సమయంలో వానలు కురువడం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కాస్త ముందస్తుగానే ప్రభుత్వం సాగు నీరు విడుదల చేయడంతో సాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి పంటలు బాగా పండి మంచి దిగుబడులు వస్తున్నాయి. దీనికి తోడు చీడ పీడలు, దోమ పోటు బెడద లేక పోవడంతో రైతులకు పురుగు మందుల పిచికారీ బాధ తప్పింది. దాంతో పాటు పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరిగింది. ధరలు సైతం ఊహించిన దానికంటే అధికంగా వస్తుండడంతో రైతులు ఆనందంగా ఉన్నారు.
క్వింటాకు రూ.2300 నుంచి 2400
సన్నధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు మించి పలుకుతున్నది. ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2060, బీ గ్రేడ్కు రూ.2040. ప్రస్తుతం రైస్ మిల్లుల్లో పూజ, హెచ్ఎంటీ, చింట్లు రకం ధాన్యానికి నాణ్యతను బట్టి మిల్లర్లు రూ.2300 నుంచి 2400 వరకు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణ సన్న ధాన్యానికి కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో అధిక డిమాండ్ ఉండటం, అక్కడ సన్న ధాన్యం స్థానిక అవసరాలకు తగిన విధంగా పండక పోవడంతో మన రాష్ట్రం ధాన్యాన్ని అక్కడి వారు కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.
సన్న ధాన్యానికి మంచి ధర వచ్చింది
యాద్గార్పల్లి గ్రామ పరిధిలో నాకున్న ఆరు ఎకరాల్లో చింట్లు సాగు చేసిన. మిషన్తో పొలం కోసి మిల్లుకు తీసుకుపోయి ధాన్యం అమ్మిన. క్వింటాకు రూ.2400 చొప్పున ధర వచ్చింది. ప్రభుత్వం మంచి అదునుకు నీరు ఇచ్చింది. చీడ పీడలు, దోమ పోటు బెడద లేక పోవడంతో ఎకరాకు 36 బస్తాలకు పైగా ధాన్యం వచ్చినై. ఈ సారి దిగుబడి పెరగటమే కాకుండా ధర కూడా మంచిగ వచ్చింది.
– పి.హనుమంత్రెడ్డి, యాద్గార్పల్లి, మిర్యాలగూడ