దామరచర్ల, మార్చి 18 : రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు ప్రకటించాలని గురుకులం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేశ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ప్రస్తుత వేతనాలు సరిపోవడం లేదని, కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందన్నారు.
అందువల్ల రాబోయే బడ్జెట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో పాటు, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సమాన పనికి సమాన వేతనం విధానం అమలు చేయాలని, కనీస వేతనాలు చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రమేశ్ నాయక్, రాష్ట్ర నాయకులు వీర నాయక్, సుమన్ పాల్గొన్నారు.