9.70 లక్షల మంది రైతులకు రూ.1101.80 కోట్లు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22.03 లక్షల ఎకరాలకు వర్తింపు
వానకాలం సీజన్ కోసం రైతుబంధు ద్వారా అందిస్తున్న పెట్టుబడి సాయం దశల వారీగా రైతుల ఖాతాల్లో జమవుతున్నది. బుధవారం నాటికి 12 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు అందింది. గత నెల 28న ఎకరంలోపు రైతులతో ప్రారంభం కాగా, ఇప్పటివరకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 9.70లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 1,101.80 కోట్ల రూపాయలు చేరాయి.
నల్లగొండ ప్రతినిధి, జూలై13(నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో వ్యవసాయంపై మక్కువ పెంచుతూ విప్లవాత్మక మార్పులకు కారణమైన రైతుబంధు పథకం ఈ సీజన్లోనూ సీఎం కేసీఆర్ రైతులకు అందజేస్తున్నారు. 2018 వానకాలం నుంచి అమలు చేస్తున్న ఈ పథకంలో ప్రస్తుతం ఎకరాకు రూ.5 వేలు పెట్టుబడి సాయంగా ప్రతి సీజన్లోనూ క్రమం తప్పకుండా అందజేస్తున్నారు. ఈ సీజన్లోనూ గత నెల 28 నుంచి రైతుబంధు డబ్బులను ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నది. తొలి రోజు ఎకరం లోపు నుంచి మొదలుపెట్టి బుధవారం నాటికి ఐదెకరాలల్లోపు రైతులందరికీ పథకం వర్తింపజేసింది. గత నెల 28,29, 30 తేదీల్లో, ఈ నెలలో 4, 6, 7, 8, 12, 13వ తేదీల్లో రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బుధవారం 12 ఎకరాల లోపు రైతులకు నగదు బదిలీ చేశారు.
జిల్లాల వారీగా
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 22.03 లక్షల ఎకరాల భూమికి సంబంధించి 9,70,422 మంది రైతులకు 1,101.80 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో మొత్తం 4,76,614 మంది రైతులకు 11.05 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.552.88 కోట్లు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లాలో 2,64,562 మంది రైతులకు 5.75 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.287.83కోట్లు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 2,29,246 మంది రైతులకు 5.22లక్షల ఎకరాలకు సంబంధించిన రూ.261.08 కోట్ల బుధవారం నాటికి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇలా దశలవారీగా మిగతా రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.