ఇప్పటివరకు చేసింది కొంత మాత్రమేనని, చేయాల్సింది చాలా ఉన్నదని, మరింత అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి
ప్రజలు అండగా నిలువాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూర్.ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో రూ.7,500 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనులు చేపట్టామని, ఒక్క ఓటు ఎంత మార్పు తీసుకొచ్చిందో గుర్తుంచుకోవాలన్నారు. దళితబంధుతో ఎన్నో దళిత కుటుంబాలు ఆర్థిక
పరిపుష్టి సాధించాయని, సీఎం కేసీఆర్ ఆదర్శ పాలనకు ఈ పథకం నిదర్శనమని తెలిపారు.
ఆత్మకూర్.ఎస్ : సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతున్నది. దళితబంధు పథకంతో తమను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు సామాజిక గౌరవానికి భరోసా కల్పించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితోనే తామంతా అంటూ ఆత్మకూర్.ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన 60 కాంగ్రెస్ పార్టీ దళిత కుటుంబాలతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్లో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలో మరెఎక్కడా లేదన్నారు.
ఏ పార్టీతో తమ బతుకులు బాగుపడ్డాయో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో బీఆర్ఎస్కు వేసిన ఓటు రూ.7,500 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి కేవలం ఆరంభం మాత్రమేనని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని మంత్రి తెలిపారు. పార్టీలకతీతంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్కు అండగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన చేరికల్లో బచ్చలకూరి సతీశ్, ఇరుగు నవీన్, బచ్చలకూరి కరుణాకర్, బచ్చలకూరి అరవింద్, గుర్రాల రాంబాబుతోపాటు దళిత కుటుంబాలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.