నల్లగొండ, మే 21 : ఓ వైపు వర్షం…మరో వైపు తీవ్రమైన ఎండల ప్రభావం.. అయినా యాసంగి సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలతో సెంటర్ల నిర్వాహకులతో పాటు అధికార యంత్రాంగం, ఆయా శాఖలకు చెందిన సిబ్బంది నిరంతర కృషి వల్ల ఎట్టకేలకు ధాన్యం సేకరణ సజావుగా సాగుతుంది. సూర్యాపేట జిల్లాలో 296 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా మంత్రి జగదీశ్రెడ్డి తరచూ సమీక్షలు,ఆకస్మిక తనిఖీలు, స్పెషల్ అధికారుల నియామకం ఒకటి, రెండు చోట్ల ప్రతిపక్షాల ప్రోద్బలంతో జరిగిన కల్పిత నిరసనలు మినహా మరెక్కడా ఎలాంటి సమస్యలు లేవు.
రైతులకు ఇచ్చే డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని డబ్బులు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతన్న సంతోషంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు పాటు పడుతున్నారు. సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టులు పూర్తి చేయడం, విత్తనాలు వేసే నాటి నుంచి పంటలు చేతికి అందేంత వరకు రైతులకు సూచనలు చేసేందుకు వ్యవసాయశాఖను బలోపేతం చేస్తూ ప్రతి ఐదు వేల హెక్టార్లకు ఏఈఓలను నియమించారు. రైతులు, వ్యవసాయానికి చేయూతను ఇస్తుండగా దేశానికే అన్నం పెట్టే స్థాయికి మన రైతన్న ఎదిగాడు. గతంలో ఈ సారి కూడా ప్రభుత్వ కొనుగోలు సంస్థలైన ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా మద్దతు ధరలు ఇచ్చి ఎంత ధాన్యం కొనుగోలు చేయడానికైనా వెనుకాడడం లేదు. దాంతో వ్యాపారులు సైతం తమ లాభాలను కాస్త తగ్గించుకొని వ్యవసాయ మార్కెట్లలో రైతులు పండించే పంటలకు మద్దతు ధరలే కాకుండా అదనంగా ధరలను ఇస్తుండడం గమనార్హం.
ప్రశాంతంగా కొనుగోళ్లు
రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు, ఈదురు గాలులతో రైతులకు నష్టం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు, రైతులు నిరసనలు తెలుపగా సూర్యాపేటలో మాత్రం ప్రశాంతంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
జిల్లాలో కోతలు అలస్యం కావడంతో కేంద్రాలు అలస్యంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 324 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా 5లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 2.02 లక్షల ధాన్యం కొనుగోలు చేశారు. రైతులకు మొత్తం 104 కోట్లు చెల్లించారు. దాదాపుగా 40 శాతం కొనుగోళ్లపూర్తయ్యాయి.
సూర్యాపేటలో 87 శాతం కొనుగోళ్లు పూర్తి
జిల్లాలో 3.57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉండగా ఇప్పటి వరకు 3.01 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం ద్వారా 87 శాతం పూర్తయింది. అలాగే ఏ రోజుకా రోజు ట్యాబ్ లో ఎంటర్ అయిన రైతుల ఖాతాల్లో వెనువెంటనే డబ్బులు వేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 341 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా మరో రూ. 250 కోట్లు వేయాల్సి ఉంది. రైతులకు ఇచ్చే డబ్బుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని డబ్బులు సిద్ధ్దంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 296 కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయగా ఇప్పటికే 69 సెంటర్లు మూసివేశారు.
నల్లగొండలో ముగింపు దశలో
నల్లగొండ జిల్లాలో 346 ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఈ యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 13.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయం శాఖ అంచనా వేసింది. ఇందులో మిల్లర్లు, ట్రేడర్లు, సన్నధాన్యం, స్థ్దానిక అవసరాలు..ఇలా మొత్తంగా 6.79 లక్షలు పోను ప్రభుత్వ రంగ మార్కెట్లకు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటి వరకు రూ.1,108 కోట్ల విలువైన 5.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మొత్తం ఆ ధాన్యం 68,962 మంది రైతుల నుంచి కొనుగోలు చేయగా ఇప్పటికే రూ.764 కోట్లు రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్మును జమ చేశారు.
ట్యాబ్ ఎంట్రీ కాగానే డబ్బులు జమ
జిల్లాలోధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగాసాగు తున్నాయి. కేంద్రాల్లో కొనుగోలు చేసిన తర్వాత ట్యాబ్ ఎంట్రీ కావడంతో ఎప్పటికప్పుడే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. పీఏసీఎస్ల ద్వారా ఇప్పటి వరకు 478 కోట్ల బిల్లుల ట్యాబ్ ఎంట్రీ జరిగితే అందులో రూ.448 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటికే 55 కేంద్రాల్లో ధాన్యం పూర్తి కొనుగోళ్లు కావడంతో ఆ కేంద్రాలను మూసి వేశాం.
-గోలి శ్రీనివాస్, జిల్లా సహకార శాఖ ఇన్చార్జి నల్లగొండ
్ల