తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు మనిషి చనిపోయాక చివరి మజిలీ నిర్వహించాలన్నా స్థలం లేక కష్టంగా ఉండేది. రోడ్లు, చెరువు కట్టల వెంబడి కార్యక్రమాలను ముగించే వారు. మనిషి పుట్టుకతో పాటు చివరి మజిలీ సైతం సక్రమంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తలంచింది. అందులో భాగంగా జిల్లాకేంద్రంలోని 21వైకుంఠధామాలను రూ.11.11 కోట్లతో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఆ వైకుంఠధామాలు.. భూలోక స్వర్గాలను తలపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని మహాప్రస్థానం అత్యాధునిక సదుపాయాలతో ఆకట్టుకుంటున్నది. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సహకారంతో అన్ని మతాల వారి వైకుంఠధామాలు అందంగా రూపు దిద్దుకున్నాయి.
సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఆయా వార్డుల ప్రజలకు అందుబాటులో గల 21 వైకుంఠధామాలను రూ.11.11కోట్లతో తీర్చిదిద్దారు. పట్టణ ప్రగతి, ఎస్డీఎఫ్ నిధులతో పట్టణంలోని 3వ వార్డు బీబీగూడెంలోని వైకుంఠధామానికి రూ.24.50లక్షలు, 12వ వార్డు పిల్లలమర్రి వైకుంఠధామానికి రూ.35.50లక్షలు, 13వ వార్డు గాంధీనగర్ వైకుంఠధామానికి రూ.43లక్షలు, 2వ వార్డు కుడకుడ వైకుంఠధామానికి రూ.50లక్షలు, దురాజ్పల్లి ఎస్సీ వైకుంఠదామానికి రూ.36.50లక్షలు, కాశీంపేట ఎస్సీ వైకుంఠధామానికి రూ.45.50లక్షలు, నల్లచెరువు తండ వైకుంఠధామానికి రూ.49.50లక్షలు, 9వ వార్డులోని క్రిస్టియన్ సమాధుల తోటకు రూ.19లక్షలు, అదే వార్డులో మరో వైకుంఠధామానికి రూ.31.60లక్షలు, బుర్కపిట ్టతండ హిందూ వైకుంఠధామానికి రూ.29.80లక్షలు, 16వ వార్డు క్రిస్టియన్ సమాధుల తోటకు రూ.23.40లక్షలు కేటాయించారు. 22వ వార్డులోని మున్నూరు కాపు వైకుంఠధామం సుందరీకరణకు రూ.29.50లక్షలు, పుల్లారెడ్డి చెరువు ఎస్సీ వైకుంఠధామం సుందరీకరణకు రూ.84.70లక్షలు, 26వ వార్డులో యాదవ వైకుంఠధామానికి రూ.47లక్షలు, 39వ వార్డులో కబరస్తాన్ సుందరీకరణకు రూ.26లక్షలు, 40వ వార్డులో మిని కబరస్తాన్ సుందరీకరణకు రూ.10లక్షలు, 43వ వార్డులోని అన్నాదురైనగర్ల గల హిందూ వైకుంఠధామాన్ని స్మృతివనంలా ఆధునీకరణకు 14వ ఆర్థిక సంఘం నిధులు రూ3.59కోట్లతో అభివృద్ధి చేశారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.50లక్షలతో తాళ్లకాంపాడ్లోని ముస్లిం కబరస్తాన్, రూ.50లక్షలతో క్రిస్టియన్ సమాధుల తోట, రూ.50లక్షలతో హిందూ వైకుంఠదామాలను మూడింటిని ఒకేచోట ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
సూర్యాపేట జిల్లాకేంద్రం మొత్తానికి ఒకనాడు అదెరువుగా ఉన్న సద్దల చెరువు పక్కన గల హిందూ వైకుంఠధామాన్ని మంత్రి జగదీశ్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహా ప్రస్థానంగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాలకే పరిమితమైన సౌకర్యాలను సైతం ఈ మహా ప్రస్థానంలో ఏర్పాటు చేస్తుండడంతో సుందరంగా తీర్చిదిద్దుకుంది. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ3.59కోట్లతో చేపట్టిన పనులతో మహా ప్రస్థానంగా రూపుదిద్దుకొని ప్రారంభానికి సిద్ధమైంది. మహా ప్రస్థానంలో మూడు దహన వాటికలు, ఒక కరెంట్ దహన వాటిక, దింపుడు గల్లం, పూజా మందిరం, ఆఫీసు భవనం, టాయ్లెట్స్, జనరేటర్ రూమ్, అందమైన గ్రీనరీ, గార్డెనింగ్, ఫుడ్ స్టోరేజ్ షెడ్లతో పాటు కార్, మోటార్ సైకిళ్ల పార్కింగ్ ఏర్పాటు చేసి అందంగా ముస్తాబు చేశారు. శ్మశానవాటిక ప్రారంభంలో ఏర్పాటు చేసిన 24అడుగుల శివుడి విగ్రహం మొత్తం మహా ప్రస్థానానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ప్రభుత్వం ఎక్కడికక్కడ వైకుంఠధామాలను అభివృద్ధి చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.