– నల్లగొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్
నల్లగొండ సిటీ, ఫిబ్రవరి 25 : నల్లగొండ జిల్లాలో పైలెట్ పద్ధతిన ఎంపిక చేసిన గ్రామాల్లో గృహ జ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు పనులను మార్చి మొదటి వారంలోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కనగల్ మండల కేంద్రంలో టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో గృహజ్యోతి లబ్ధిదారులకు అమలు చేస్తున్న “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కనగల్ గ్రామంలో 292 మంది గృహ జ్యోతి లబ్ధిదారులు ఉండగా, వీరికి రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు పైలట్ పద్ధతిన ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక జిల్లాలోని అనుముల మండలం అనుముల, దేవరకొండ మండలం ముదిగొండ గ్రామాలలో సైతం పైలెట్ పద్ధతిన “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ మూడు గ్రామాలలోని గృహ జ్యోతి లబ్ధిదారుల ఇళ్లపై రెండు కిలోవాట్ల “ రూప్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేస్తారని, కనగల్ గ్రామంలో ఇప్పటికే 77 ఇళ్లపై “రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు చేసే పనులు మొదలైనట్లు వెల్లడించారు.
అనంతరం పక్కనే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారు నల్లబోతు వెంకటమ్మతో మాట్లాడి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారితో మాట్లాడుతూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. కనగల్ మండలంలో ఇప్పటివరకు కేవలం 47% మాత్రమే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం జరిగిందని, అందువల్ల రైతులందరూ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఇందుకు సర్పంచ్ మురళీధర్ సహకరించాల్సిందిగా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ కో జిల్లా మేనేజర్ సంతోష్, ట్రాన్స్కో ఏఈ ఆర్ ఎన్.జె.కుమార్, తాసీల్దార్ పద్మ, ఎంపీడీఓ వేద రక్షిత, సెక్రటరీ వీరబాబు పాల్గొన్నారు.

“రూఫ్ టాప్ సోలార్ సిస్టం” ఏర్పాటు పనులను పది రోజుల్లో పూర్తి చేయలి’