ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి
పచ్చదనమే భవిష్యత్ తరాలకు జీవనాధారం
హరితహారంలో విస్తృతంగా మొక్కలు నాటాలి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేటలో మిద్దె తోటలపై అవగాహన సదస్సు
మిద్దెతోటల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని, రసాయన అవశేషాలు లేకుండా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండించి ఆరోగ్యంతోపాటు ఆర్థికంగా లబ్ధి పొందొచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లో మిద్దెపంటలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజలు తమ నివాసాల్లోని ఖాళీ ప్రదేశాలు, మిద్దెలపై అవసరాలకు అనుగుణంగా కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకోవచ్చన్నారు. దీని ద్వారా ప్రకృతిని పరిరక్షించడంతోపాటు పచ్చదనం పెంపొందించుకోవచ్చని తెలిపారు. రానున్న హరితహారంలో విరివిగా మొక్కలు నాటి వీధులను హరిత వనాలుగా మార్చాలని పిలుపునిచ్చారు.
సూర్యాపేట టౌన్, జూన్ 19 : మిద్దెతోటలు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని.. వీటిద్వారా పలువురు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్లో ఆదివారం జరిగిన మిద్దెపంటపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని, పట్టణ ప్రజలు తమ ఇంటి మిద్దెలపై తోటలను ఏర్పాటు చేసుకొని తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండించుకోవచ్చన్నారు. అధికంగా పండించుకోగలిగితే కొంతమేర ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, పచ్చదనం పెంచేందుకు మిద్దె తోటలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటి వీధులన్నీ హరిత వనాలుగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. రోడ్లు, కాలువలకు ఇరవైపులా, పార్కులు, వైకుంఠధామాలు, ఖాళీ స్థలాలతో పాటు ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలన్నారు. ఇంట్లో ఖాళీ స్థలం లేనివారు మిద్దెతోటపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం నిర్వాహకులు మిద్దెపంట పెంచడంలో మెళకువలపై అవగాహన కల్పించారు. మిద్దె తోట సామగ్రికి సుమారు రూ.10 వేలు అయితే కేవలం రూ.1500 లకే అందించి మిగిలినవి మంత్రి జగదీశ్రెడ్డి స్వయంగా భరిస్తున్నారని తెలిపారు. మంత్రి సహకారంతో ఇప్పటి వరకు సూర్యాపేటలో సుమారు 2 వేల మందికి మిద్దెతోట సామగ్రి అందించినట్లు పేర్కొన్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన మిద్దె పంట స్టాల్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితా ఆనంద్, ప్రధాన వక్త తుమేటి రఘోత్తమ్ రెడ్డి, నిర్వాహకులు నేచర్వాయిస్ క్రాంతి, మమత, శ్రీదేవి పాల్గొన్నారు.
దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘం
లెఫ్టినెంట్ ఇమ్మడి పవన్ను సన్మానిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి
దేశ రక్షణలో సైనికుల పాత్ర అమోఘమని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. వారు సరిహద్దుల్లో కాపలా ఉండడం వల్లే మనం ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. దేశ రక్షణలో ముందుండి పోరాడిన గోపయ్యచారి, కర్నల్ సంతోష్బాబుల అమరత్వం అజరామరమని కొనియాడారు. నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి పవన్ సైన్యంలో లెఫ్టినెంట్గా ఉద్యోగోన్నతి పొందిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పవన్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.