రూ.6 కోట్లతో ఆరు లేన్లుగా నిర్మాణం
తడకమళ్ల రోడ్డు నుంచి ఏడుకోట్ల తండా బైపాస్ వరకు విస్తరణ
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
మిర్యాలగూడ, మే16 : నిరంతరం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని నల్లగొండ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృషి చేశారు. జాతీయ రహదారుల నిధులను పట్టణంలోని నల్లగొండ రోడ్డు విస్తరణకు మళ్లించారు. ప్రస్తుతం ఎన్హెచ్ అధికారుల పర్యవేక్షణలోనే రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయి.
ఇక సాఫీగా ప్రయాణం
పట్టణంలోని నల్లగొండ రోడ్డు మీదుగా నల్లగొండ, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి బస్సులు, భారీ వాహనాలు నిత్యం వేలాదిగా రాకపోకలు సాగిస్తుంటాయి. దాంతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం రోడ్డు ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్జామ్తో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డు విస్తరణ వల్ల వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
రూ. 6 కోట్లతో రోడ్డు విస్తరణ
పట్టణంలోని తడకమళ్ల రోడ్డు చౌరస్తా నుంచి ఏడుకోట్లతండా వద్ద అద్దంకి-నార్కట్పల్లి రోడ్డు వై జంక్షన్ వరకు ఆరు లేన్లుగా విస్తరిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణలో భాగంగా మధ్యలో డివైడర్లు నిర్మించి సెంట్రల్ లైటింగ్, రెండువైపులా డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల భారీ వాహనదారులతో పాటు బైక్లు నడిపే వారు సైతం ప్రమాదాలబారిన పడకుండా నివారించటానికి వీలవుతుంది. తడకమళ్ల రోడ్డు నుంచి వై జంక్షన్ వరకు లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల పట్టణంలోని బంగారుగడ్డ, రామచంద్రగూడెం, చైతన్యనగర్, రాంనగర్ కాలనీల వాసులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రమాదాలు తగ్గుతాయి
పట్టణంలోని తడకమళ్ల రోడ్డు నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు రద్దీగా ఉంటుంది. రోడ్డును ఆరు లేన్లుగా విస్తరించటం వల్ల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. సమీపంలోని కాలనీల ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయి.
– పాశం యాదగిరి