హాలియా, మే 2 : తెలంగాణ రాష్ర్టానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హాలియాలో భారీ ర్యాలీ, రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్, ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేసినందుకా.. నల్లగొండ జిల్లాలో, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో వేలాది ఎకరాలను ఎండబెట్టినందుకా? అని ప్రశ్నించారు. వంచన చేయడం కాంగ్రెస్ పార్టీ అన్నారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ల మోసాలను ఆమోదించిన వాళ్లమవుతామని తెలిపారు. హామీలిచ్చి అమలు చేయని ఆ పార్టీకి ఓటు అనే ఆయుధంతో కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు, నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై తాను సిద్ధం.. జానారెడ్డి సిద్ధ్దమేనా అని సవాల్ విసిరారు. జానారెడ్డి 17సంవత్సరాలు మంత్రిగా ఉండి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను పదేండ్లలో నల్లగొండ జిల్లా అభివృద్ధికి తీసుకొచ్చిన నిధుల్లో జానారెడ్డి 25 శాతం కూడా తీసుకురాలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. హాలియా, నందికొండను మున్సిపాలిటీలు చేయడంతోపాటు ప్రతి గ్రామానికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చామని, హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. జానారెడ్డి హయాంలో రాజవరం మేజర్ కాల్వలో నీళ్లు ఎందుకు రాలేదో, కాల్వ చివరి భూములకు సాగునీరు ఎందుకు అందలేదో, ఇప్పుడు ఎందుకు అందుతున్నాయో జానారెడ్డి చెప్పాలన్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో యాసంగిలో 25వేల ఎకరాలు ఎండిపోతున్నా ఆయన ఎందుకు పట్టించుకోలేదో, ఆ బాధ్యత ఎవరిదో జానారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలు తనను 35 ఏండ్లు మోసిండ్రు.. ఇప్పుడు తన కుమారులను ప్రజల భుజాల మీద బలవంతంగా పెట్టి జానారెడ్డి మోపిస్తుండ్రు అని విమర్శించారు.
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు 12రోజులు నీళ్లు పోయినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు చుక్క నీళ్లు ఇప్పించలేని అసమర్ధ నాయకులు జిల్లా మంత్రులని మండిపడ్డారు. రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గతంలో అన్నారని తెలిపారు. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తనకు ఇప్పటికీ రైతు బంధు రాలేదని అన్నారని, ఇప్పుడు తుమ్మలను కోమటిరెడ్డి అయినా చెప్పుతో కొట్టాలి.. లేకుంటే కోమటిరెడ్డిని తుమ్మల అయినా చెప్పుతో కొట్టాలని అన్నారు.
హామీలను విస్మరించిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, ఎంపీపీలు సుమతీ పురుషోత్తం, జయమ్మ, జడ్పీటీసీ సూర్య బాష్యానాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కడారి అంజయ్యయాదవ్, మండలాధ్యక్షులు, నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.