హుజూర్నగర్ రూరల్, సెప్టెంబర్ 22 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామ నల్లచెరువుకు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్లీ గండి పడింది. గత నెల 24న కురిసిన వర్షాలతో వరద ప్రవాహానికి నల్లచెరువుకు గండి పడటంతో గోపాలపురం- బూరుగడ్డ గ్రామాల మధ్యగల రోడ్డు కొట్టుకుపోయింది. దాంతో పదిరోజుల పాటు రాకపోకలు నిలిచిపోయి సమీప గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో ఆ తర్వాత అధికారులు తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేసి రాకపోకలను పునరుద్ధరించారు.
కాగా శనివారం కురిసిన వర్షపు నీటితో పాటు నాగార్జున సాగర్ జలాలు వచ్చి చేరడంతో వరద పెరిగింది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండటం వల్ల చెరువు కట్టను జేసీబీతో కొంత భాగాన్ని తొలగించి గండి పెట్టి నీటిని దిగువకు వదిలారు. దాంతో గండి పెరిగి కరక్కాయలగూడెం, మాచవరం, బూరుగడ్డ గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గ కేంద్రానికి రావాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సమీప గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు సాధ్యమైనంత త్వరగా చెరువు కట్టకు మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.