రామగిరి, డిసెంబర్ 30 : సామాన్యుడి చేతిలో వజ్రాయుధమైన సమాచార హక్కు చట్టంపై యువత అవగాహన పెంచుకోవాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ గగులోతు శంకర్నాయక్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయలో ‘ఆర్టీఐ యాక్ట్పై అవగాహన’ అనే అంశంపై నిర్వహించిన ఒక్కరోజు వర్క్షాప్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం కేంద్రం 2005లో ఈ చట్టాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఆర్టీఐ యాక్టులో 31 సెక్షన్లు ఉన్నాయని, ఇవి ఆయా అంశాలను బట్టి వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న ఏ సంస్థ సమాచారమైనా అభ్యర్థించవచ్చన్నారు. యువత విధిగా ఈ చట్టంపై అవగాహన పెంచుకుని గ్రామీణులను చైతన్యం చేయాలని కోరారు.
తప్పు దరఖాస్తుతో తిప్పలు తప్పవు
ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం అధిపతి, ఎంజీయూ న్యాయ సలహాదారు, ప్రొఫెసర్ ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంతో అడిగే ప్రశ్నల సరళి, చట్టం ప్రధాన ఉద్దేశం, పబ్లిక్, ప్రైవేట్ జీవితం తదితర అంశాలు వివరించారు. తప్పుడు దరఖాస్తు చేస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదన్నారు. సమాచార హక్కు చట్టంతో చేసే దరఖాస్తులో ప్రశ్నలు జాగ్రత్తగా సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా చూడాలన్నారు. ఆర్డీఓ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ 2జీ స్కాం ఆర్టీఏ చట్టంతోనే వెలుగులోకి వచ్చిందన్నారు. ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వర్క్షాప్లో రిజిస్ట్రార్ , ప్రొఫెసర్ కృష్ణారావు, ఎంజీయూ ఓఎస్డీ అల్వాల రవి, డైరెక్టర్ అడ్మిషన్స్ ఆకుల రవి, కాంపిటేటివ్ సెల్ డైరెక్టర్ దోమల రమేశ్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఉపేందర్రెడ్డి, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, హాస్టల్స్ డైరెక్టర్ ప్రేమ్సాగర్ పాల్గొన్నారు.