త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. నియోజకవర్గాల వారీగా నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ సమాయత్తమవుతున్నది. అందులో భాగంగా శుక్రవారం భువనగిరి పార్లమెంట్ స్థానంపైన, సంక్రాంతి తర్వాత 16న నల్లగొండ స్థానంపైన సమీక్షకు సిద్ధమైంది.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా జరిగే సమీక్షల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష చేస్తూ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నేటి సమీక్ష సమావేశానికి భువనగిరి లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులంతా హాజరుకానున్నారు.
తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాల్లోని లోటు పాట్లపై విశ్లేషిస్తూనే లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా సిద్ధం కావడానికి బీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది. ఉమ్మడి జిల్లా పరిధిలో భువనగిరి, నల్లగొండ లోక్సభ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గాల వారీగా శుక్రవారం భువనగిరి, 16న నల్లగొండ స్థానాల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలకు షెడ్యూల్ ప్రకటించింది. అందులో భాగంగానే నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భువనగిరి లోక్సభ స్థానంపై సమీక్షా సమావేశం జరుగనున్నది.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగే భువనగిరి లోక్సభ స్థానంపై సమీక్షా సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానుండగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్లతోపాటు లోక్సభ స్థానం పరిధిలోని జిల్లా పార్టీల అధ్యక్షులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు, ఇతర ముఖ్యులు పాల్గొననున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటును 100 మంది చొప్పున మొత్తం ఏడు స్థానాల నుంచి 700 మంది వరకు హాజరుకానున్నారు.
వీరందరికి యువనేత కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. భువనగిరి లోక్సభ స్థానం పరిధిలో భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు, ఇబ్రహీంపట్నం, జనగామ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం జనగామలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. మిగతా ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక ఇదే సమయంలో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరిలో స్వల్ప తేడాతో కాంగ్రెస్ గెలుపొందింది.
అయినా సరే భువనగిరి లోక్సభ స్థానంపైన ఈ సారి గులాబీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధం కానున్నది. భువనగిరి లోక్సభ నియోజకవర్గం అంతటా బలమైన పార్టీ యంత్రాంగం ఉంది. గత ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిషలు కష్టపడ్డారు. ప్రజల్లో కనిపించిన మార్పు సంకేతంతో అనూహ్య ఫలితాలు చవిచూడాల్సి వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేక ఫలితాలపై సమీక్షిస్తూ లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసేలా దిశానిర్దేశం చేయనున్నారు.
సంక్రాంతి అనంతరం ఈ నెల 16వ తేదీన నల్లగొండ లోక్సభ స్థానంపైన తెలంగాణ భవన్లో సమీక్షా సమావేశం జరుగనున్నది. ఇందులోనూ భువనగిరి తరహాలోనే ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలంతా పాల్గొననున్నారు. నల్లగొండ లోక్సభ స్థానం పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో సూర్యాపేటలో జగదీశ్రెడ్డి మినహా మిగతా పార్టీ అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ఓటమిపై పార్టీ పరంగా జరిగిన లోటుపాట్లను చర్చిస్తూనే నల్లగొండ లోక్సభ స్థానంలో గెలుపుపై దృష్టి సారించనున్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికలపై వ్యూహరచన చేయనున్నారు.