గణతంత్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడోత్సవాలు సంబురంగా జరిగాయి. స్వతహాగా క్రీడాభిమాని అయిన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఎనిమిదేండ్లలో అనేక రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీలకు సూర్యాపేట అతిథ్యమిచ్చేలా చొరవ తీసుకొని విజయవంతం చేశారు. అదే స్ఫూర్తితో మంత్రి జగదీశ్రెడ్డి 51 ప్రభుత్వ పాఠశాలల్లో జీజేఆర్ కప్ పేరుతో కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రెండు రోజులు గ్రామ, మండల స్థాయిలో బుధవారం నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగగా మంత్రి పాల్గొని ప్రారంభించారు. మూడు రోజులు జరిగిన క్రీడల్లో 15వేల మందికిపైగా క్రీడాకారులు పాల్గొనగా జెర్సీలు అందించారు. గురువారం ఆయా పాఠశాలల్లో విజేతలతోపాటు క్రీడా భాగస్వాములకు 13 వేల బహుమతులు అందజేయనున్నారు. ఈ పోటీల ద్వారా గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– సూర్యాపేట, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)
దశాబ్దాల క్రితం ఘన చరిత్ర ఉన్న సూర్యాపేట ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సూర్యాపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేస్తున్న గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట గుర్తింపునకు పునరుజ్జీవం పోస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి విషయంలో కండ్ల ముందే సాక్షాత్కరిస్తున్న వాటిని చూస్తూ జగదీశ్రెడ్డికి ముందు.. తరువాత అని సూర్యాపేట ప్రజలు చెప్పుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమాలే కాదు.. అన్ని రంగాల్లో మంచి గుర్తింపు వస్తున్నది. ప్రధానంగా మంత్రి స్వతహాగా క్రీడాభిమాని కావడంతో అనేక రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యం లభిస్తుంది. మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో క్రీడా శాఖ, ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2015 నుంచి ఇప్పటి వరకు సూర్యాపేటలో అండర్-17, 19 రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు, రెండు సార్లు అండర్-18 నేషనల్ స్పోర్ట్స్ మీట్ తదితరాలు కలిపి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి మీట్లు దాదాపు 10కి పైగానే జరిగాయంటే ఇక్కడ క్రీడలకు ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.
– సూర్యాపేట, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)
15 వేల క్రీడాకారులు.. 13 వేల బహుమతులు
రిపబ్లిక్ డేను పురస్కరించుకొని మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 51 జిల్లా పరిషత్, మోడల్, కేజీబీవీ ఉన్నత పాఠశాలల్లో గ్రామ, మండల, నియోకవర్గ స్థాయిల్లో జూనియర్, సీనియర్ బాల బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడల్లో దాదాపు 15 వేలకు పైగానే విద్యార్థులు పాల్గొన్నారు. 51 పాఠశాలల్లో ఒక్కో పాఠశాల నుంచి ప్రథమ, ద్వితీయ బహుమతులు 240 మంది చొప్పున, 12,240 మందికి వ్యక్తిగత బహుమతులు, వీరితోపాటు మండల స్థాయిలో 520 మందికి, నియోజకవర్గ స్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు 240 మందికి గురువారం ఆయా పాఠశాలల్లో అందించనున్నారు. వ్యక్తిగత బహుమతులతోపాటు జీజేఆర్ కప్లు అందిస్తారు.
సూర్యాపేటటౌన్, జనవరి 25 : ప్రతి విద్యార్థి జీవితంలో విద్యతో వెలుగు వస్తే.. క్రీడలతో స్ఫూర్తి అలవడుతుందని, జీవితంలో ప్రతి ఒక్కరూ ఓటమిని తట్టుకొని గెలుపొందాలంటే క్రీడా స్ఫూర్తి అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జీజేఆర్ కప్ నియోజకవర్గస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లల సమగ్రాభివృద్ధిలో క్రీడలు ముఖ్య భాగమన్నారు. క్రీడల ద్వారా ఓటమి నుంచి తిరిగి గెలుపొందాలనే స్ఫూర్తి కలుగుతుందని పేర్కొన్నారు. క్రీడలు శారీరక, మానసిక ధృడత్వానికి ఎంతో దోహదపడుతాయన్నారు. ఈ మేరకు పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచనలు మారాలన్నారు. మంచి సమాజ నిర్మాణ ప్రక్రియలో క్రీడా సంస్కృతి దోహదపడుతుందన్నారు.
దేశంలో క్రీడా విద్యకు తగిన బడ్జెట్ కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశాన్ని పాలిస్తున్న పాలకుల వైఫల్యం వల్లే అతి పెద్ద జనాభా కలిగిన మన దేశం ఒలింపిక్స్ వంటి పోటీల్లో అట్టడుగున నిలిచేందుకు కారణమన్నారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురువారం బహుమతులు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రీడల మాదిరిగానే త్వరలో యువత కోసం క్రీడలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే తాను చదువుకున్నానని, అలాంటి కళాశాలకు త్వరలోనే అన్ని వసతులతో నూతన భవనం మంజూరు చేస్తానని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. 1270 మంది విద్యార్థులు అభ్యసిస్తున్న కళాశాలలో అదనపు తరగతి గదులు నిర్మించాలని కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య విజ్ఞప్తి మేరకు మంత్రి స్పందిస్తూ నూతన భవనం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కళాశాలలో చదివి రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించిన నిరుపేద విద్యార్థిని కొమ్ము ప్రశాంతి ఉన్నత విద్యకు అయ్యే ఖర్చులను భరిస్తానన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్ తాహేర్పాషా, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మద్దెమడుగు సైదులు, అధ్యాపకులు బాల్తు శ్రీనివాస్, గొట్టెముక్కల వెంకన్న, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చీకూరి కృష్ణ, చింతం లింగం, బోగిన భాస్కర్, వగ్గు సతీశ్, వెంకట్రాములు, లాగండి సైదులు, ప్రవీణ్ పాల్గొన్నారు.
క్రీడాభివృద్ధికి లక్షలాదిగా ఖర్చు
ఇప్పటికే మంత్రి జగదీశ్రెడ్డి మాతృమూర్తి దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ పేరిట ఎస్.ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూనే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన జీజేఆర్ క్రీడా పోటీలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడ లేదు. గ్రామీణ క్రీడలకు అత్యంత ఆదరణ కల్పిస్తూ క్రీడాకారుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు బహుమతులు, భోజన వసతి కల్పించడంతోపాటు అన్ని పాఠశాలలకు క్రీడా కిట్లు, క్రీడా దుస్తులు ఇచ్చేందుకు తన వ్యక్తిగత నిధులు వెచ్చించడంపై పలువురు మంత్రిని అభినందిస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ క్రీడారంగాన్ని పటిష్టం చేసి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తరచూ క్రీడా పోటీలు నిర్వహిస్తుండడం, ఈ సారి ఏకంగా అన్ని పాఠశాలల్లో పోటీలు నిర్వహించడంపై విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడా చూడలే
చిన్ననాటి నుంచే క్రీడల్లో పట్టు సాధించాలనే కోరిక నాలో బలంగా పెరిగింది. ఎన్ని ఒడి దుడుకులు ఎదురైనా నాలోని క్రీడాపటిమను పటిష్ట పర్చుకుంటూ సూర్యాపేట మండల కబడ్డీ టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నా. మేము మండల స్థాయిలో 5 పోటీలు, జిల్లా స్థాయిలో రెండు పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాం. ఇటీవల బాలెంలలో నిర్వహించిన క్రీడల్లో సైతం మొదటి బహుమతి పొందాం. మేము పాల్గొన్న ప్రతి పోటీని గమనించాం. తగిన ఏర్పాట్లు లేక ఇబ్బంది పడ్డాం. కానీ, జీజేఆర్ కప్లో ఎలాంటి ఇబ్బందులు పడలేదు. ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడా చేయలేదు. మంత్రి జగదీశ్రెడ్డి క్రీడాకారులను సొంతబిడ్డల్లా భావించి చక్కటి ఏర్పాట్లు చేయించారు. మంత్రి జగదీశ్రెడ్డికి క్రీడాభివందనాలు.
-వి.జగదీశ్, కబడ్డీ క్రీడాకారుడు, దాసాయిగూడెం(టీఎస్ఎంఎస్ మోడల్ స్కూల్)
అవకాశం కోసం ఎదురు చూస్తున్నా
నేను ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నా. నా అభిరుచి మేరకు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నా. ఖోఖోలో ప్రతిభ కనబర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశా. కేవలం పాఠశాల స్థాయిలోనే ప్రతిభ కనబర్చిన నేను మండల స్థాయిలో ఎంపికై నేడు నియోజకవర్గస్థాయిలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా. నా లాంటి క్రీడాకారులకు ఇది చక్కని అవకాశం. నేనేంటో నిరూపించుకుంటా. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి వారిలో ప్రతిభకు పదును పెట్టేందుకు ఇంత మంచి అవకాశం కల్పించిన మంత్రి జగదీశ్రెడ్డికి ధన్యవాదాలు.
-పెద్దింటి శిరీష(ఖోఖో క్రీడాకారిణి, సింగారెడ్డిపాలెం(అనంతారం స్కూల్)
ప్రజాస్వామ్యానికి పునాది ఓటు
ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అని, సమాజంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జూనియర్ కళాశాలలో యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ గతిని మార్చగల శక్తి ఓటుకు మాత్రమే ఉందన్నారు. వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి వ్యవస్థ మార్పునకు నాంది పలికేది ఓటు అని పేర్కొన్నారు.