నిడమనూరు, సెప్టెంబర్ 9 : మండలంలోని వేంపాడు గ్రామం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండికి మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ ఎస్ఈ ధర్మా, ఈఈ లక్ష్మణ్రావు, డీఈ సంపత్ శుక్రవారం పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. గండి పడిన ప్రదేశంలో నీటి ప్రవాహం నిలిపివేతకు ఇసుక బస్తాలతో క్రాస్ బండ్ పనులు చేపడుతున్నారు. గండి ప్రదేశంలో ఇసుక మేట, నీట నిల్వను తొలగించేందుకు జేసీబీ సాయంతో తాత్కాలికంగా కాల్వను ఏర్పాటు చేశారు. అత్యవసర అనుమతులతో ఇసుక, మట్టిని తరలిస్తూ నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేసే దిశగా అధికారు లు ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రి వేళలో కూడా పనులు చేపడుతున్నారు. గండి వద్ద పలు శాఖల అధికారుల హడావిడి కనిపిస్తున్నది.
రోడ్డును పరిశీలించిన ఆర్అండ్బీ ఈఈ
ఎడమ ప్రధాన కాల్వ గండి నేపథ్యంలో నిడమనూరు-నర్సింహులగూడెం గ్రామాల నడుమ ధ్వంసమైన రోడ్డును రోడ్లు, భవనాల శాఖ జాతీయ రహదారి ఖమ్మం ఈ.ఈ. యుగంధర్ పరిశీలించారు. ధ్వంసమైన రోడ్డుతో పాటు నిడమనూరు పట్టణం సమీపంలోని వంతెన కింది భాగంలో సైడ్ డ్రెయిన్ కోతకు గురైన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం లేకుండా రోడ్డు పునర్నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట ఏఈ సురేందర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
గండి ప్రదేశాన్ని పరిశీలించిన జూలకంటి
గండి ప్రదేశాన్ని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సందర్శించారు. వ్యవసాయ భూముల్లో పంట నష్టాన్ని పరిశీలించి ఇసుక మేటలు వేసిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. నర్సింహులగూడెం, నిడమనూరు పట్టణంలో ముంపు బారిన పడ్డ గురుకుల పాఠశాల, ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కూన్రెడ్డి నాగిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారు.