నల్లగొండ ప్రతినిధి, జనవరి 24(నమస్తే తెలంగాణ) : రిలియన్స్ జియో దేశవ్యాప్తంగా మరో 50 పట్టణాల్లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రక టించింది. ఇందులో రాష్ట్రం నుంచి నల్లగొండకు స్థానం దక్కింది. ఐదో తరం మొబైల్ ఇంటర్నెట్ కనెక్టవిటీగా పిలుచుకునే 5జీ సేవలతో అప్లోడ్లు, డౌన్లోడ్లు మరింత వేగంగా జరుగనున్నాయి. దాంతో పాటు మొబైల్ సిగ్నల్ కవరేజీ మరింత విస్తృతంగా, కనెక్షన్లు మరింత స్థిరంగా ఉండనున్నాయి. రేడియో స్పెక్ట్రమ్ను ఇంకా బాగా ఉపయోగించుకోవడం వల్ల ఏకకాలంలో మరిన్ని డివైజ్లను మొబైల్ ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యేలా వీలు కలుగుతుందని భావిస్తున్నారు. ఇక 5జీ సర్వీసులతో స్మార్ట్ ఫోన్లతో ఇప్పుడు చేస్తున్న పనులన్నీ మరింత వేగంగా జరుగనున్నాయి.
సాఫ్ట్వేర్లో జాప్యం బాగా తగ్గి మధ్యలో ఆగిపోవడాలు ఉండవు. మొబైల్ వీడియోలు ఎటు వంటి ఆటంకాలు లేకుండా తక్షణమే డౌన్లోడ్, అప్లోడ్ కానున్నాయి. 5జీ స్పీడులో వీడియో కాల్స్ మరింత స్పష్టంగా ఉండనున్నాయని తెలుస్తోంది. తద్వారా ఆరోగ్యపరమైన అలర్ట్లు చేసుకోవచ్చని సమాచారం. శరీరం మీద ధరించే ఫిట్నెస్ డివైజ్లు మన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేలా తక్షణమే డాక్టర్లను సైతం అలర్ట్ చేసే సదుపాయాలు అందుబాటు లోకి రానున్నాయి.
వ్యక్తిగతంగా చూస్తే…
మొబైల్ గేమ్స్ ఆడే వారికి సాఫ్ట్వేర్లో జాప్యం, కనెక్టివిటీ సమస్య ఉండకపోవచ్చు. ప్రస్తుతం డాటా వినియోగం పెరిగిపోతున్నది. వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్రజాదరణ పెరిగే కొద్దీ డేటా వినియోగమూ పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న స్పెక్ట్రం బ్యాండ్లు ఇరుకవుతున్నాయి. దీని వల్ల సర్వీసుల్లో అంతరాయం కలుగుతుంది. ప్రత్యేకించి ఒకే ప్రాంతంలో జనసమూహాం ఎక్కువగా ఉన్నప్పుడు మొబైల్ సర్వీసులు యాక్సెస్ కాకపోవడం, మధ్యలోనే స్తంభించిపోవడం వంటి సమస్యలు ఇప్పటివరకు ఎదురువుతున్నాయి.
5జీ టెక్నాలజీతో ఏకకాలంలో వేలాది డివైజ్లు, మొబైల్ ఫోన్లు మొదలుకుని సెన్సార్లు, వీడియో కెమెరాలు, స్మార్ట్ స్ట్రీట్ లైట్ల వరకు చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఇన్ని సదుపాయాలు ఉన్న 5జీ సర్వీసులు నల్లగొండకు అందుబాటులోకి వస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.