ఓటు వజ్రాయుధం లాంటిది. మెరుగైన సమాజం కోసం, సమర్ధులైన నాయకులను ఎన్నుకోవడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. అయితే.. ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నందున కేంద్ర ఎన్నికల సంఘం రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్-2023 పేరుతో కొత్తగా మరో షెడ్యూల్ను ప్రకటించింది. తద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. కొత్తగా ఓటరు నమోదుతోపాటు ఇతర మార్పులు, చేర్పులకు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 25 నుంచే ఇంటింటా మొదలైన బీఎల్ఓల సర్వే జూన్ 23 వరకు కొనసాగనుండగా డబుల్, చనిపోయిన ఓటర్లను తొలగించిన సవరణల ద్వారా అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.
ఎన్నికల సంఘం ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) ద్వారా ఓటరు జాబితా సవరిస్తుంది. ఇందులో భాగంగా నవంబర్ నెలలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తుంది. కానీ.. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడం వల్ల రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్ను ప్రకటించింది. ఇది ఈ నెల 25న ప్రారంభమై అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనుంది. ఇందులో భాగంగా ఇంటింటా సర్వేతోపాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తారు.
జూన్ 24నుంచి పోలింగ్ కేంద్రాల గుర్తింపు
జూన్ 24 నుంచి జూలై 24 వరకు పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. వాటిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో పరిశీలించడంతోపాటు ఓటరు జాబితా మార్పులు, చేర్పులకు అనుగుణంగా ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటారు. పాత పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు ఉంటే కొత్త కేంద్రాలను గుర్తిస్తారు. అవసరమైతే మరిన్ని పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించి ఎన్నికల సంఘానికి పంపిస్తారు.
ఇంటింటి సర్వే ప్రారంభం
ఈ నెల 25 నుంచి జూన్ 23 వరకు బీఎల్ఓలు ఇంటింటా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయిస్తారు. అదేవిధంగా రెండు ఓట్లు ఉన్నవారిని, చనిపోయిన వారిని, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి వారి పేర్లను తొలగిస్తారు. ఓటరు జాబితాలో సవరణలు ఉంటే చేసే విధంగా ఓటర్లకు అవగాహన కల్పిస్తారు.
అక్టోబర్ 4న తుది జాబితా
రెండో స్పెషల్ సమ్మరి రివిజన్లో భాగంగా అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు. జూలై 31వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆగస్టు 2న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఆ జాబితాపై ఆగస్టు 2నుంచి 31వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మధ్య కాలంలో నూతన ఓటరు నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులపై రెండో శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 22న అభ్యంతరాలను పరిశీలించి అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.
యువత ఓటు నమోదు చేసుకోవాలి
అర్హులైన యువతీ యువకులు ఈ ఏడాది అక్టోబర్ 1నాటికి 18 ఏండ్లు నిండితే ఓటు హక్కును నమోదు చేయించుకోవాలి. చనిపోయిన ఓటర్లు, స్థానికంగా లేని వారిని గుర్తించే విషయంపై రాజకీయ పక్షాల వారు బీఎల్ఓలకు సమాచారం అందించి సహకరించాలి. నూతన ఓటరు నమోదు,
తొలగింపులు, మార్పులు, చేర్పులపై రెండో శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు.
– చెన్నయ్య, మిర్యాలగూడ ఆర్డీఓ