నల్లగొండ, ఫిబ్రవరి 24 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ముసాయిదా ఓటరు జాబితాను నల్లగొండ కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన శనివారం ప్రచురించారు. నియోజకవర్గవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇప్పటి వరకు 4,27,289 మంది పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగా, అందులో 2,66,622 మంది పురుషులు, 1,60,661మంది మహిళా ఓటర్లు, ఆరుగురు ఇతరులు ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీకి రాజీనామా చేయగా తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు గానూ ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఈ నెల 6 వరకు గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ఇప్పటివరకు 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై అభ్యంతరాలు ఉంటే మార్చి14 వరకు తెలియజేయాలని కలెక్టర్ హరిచందన సూచించారు. శనివారం విడుదల విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయాలతోపాటు ఆర్డీఓ, తాసీల్దార్ కార్యాలయాలు, నియోజకవర్గంలో గుర్తించిన 600 పోలింగ్ కేంద్రాల్లో ప్రచురించినట్లు కలెక్టర్ తెలిపారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను మార్చి 14 వరకు స్వీకరించనున్నట్లు చెప్పారు.