బొడ్రాయిబజార్, డిసెంబర్ 8 : రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడంలో మార్కెట్ అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులకు ధరలు పలుకుతున్నాయి. గురువారం 34 క్వింటాళ్ల పత్తి రాగా క్వింటా పత్తి రూ.8,259 పలికింది. 12,826 క్వింటాళ్ల ధాన్యం రాగా క్వింటా రూ.2,592 రికార్డు ధర పలికింది.
పత్తి ధర విషయంలో రాష్ట్రంలోని జమ్మికుంట రూ.8,250, వరంగల్-8,100, ఆదిలాబాద్ 8 వేలు పలుకగా సూర్యాపేట మార్కెట్లో రూ.8,259 ధర పలుకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులు ఎప్పటికప్పుడు ధరలను పర్యవేక్షిస్తున్నారు. మద్దతుకు మించి ధర పలుకుతుండడంతో సూర్యాపేట మార్కెట్కు ధాన్యం పోటెత్తుతున్నదని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎండీ.ఫసియుద్దీన్ తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.