స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆలయాలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. మసీదులు, చర్చిలకు ఆధునిక హంగులద్దేందుకు నిధులు మంజూరు చేస్తున్నారు. యాదగిరి గుట్ట ఆలయాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ఇల వైకుంఠంగా సర్వాంగ సుందరంగా మార్చారు. ధూప, దీప నైవేద్య పథకంతో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకురావడంతోపాటు అర్చకులు, ఉద్యోగులకు 010తో సకాలంలో వేతనాలు
అందిస్తున్నారు. మౌలానాలు, పాస్టర్లకు అదే స్థాయిలో గౌరవ భృతి ఇస్తున్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విదేశీ విద్య అభ్యసించేలా పేద బ్రాహ్మణ పిల్లలకు
అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధాత్మిక దినోత్సవాన్ని
నిర్వహించనున్నారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో వేడుకలు జరిపించనున్నారు.
– రామగిరి, జూన్ 20
రామగిరి /బొడ్రాయి బజార్, జూన్ 20: గత పాలకుల కాలంలో జీర్ణ అవస్థకు చేరిన ఆలయాలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ధూప, దీప నైవేద్య పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,675 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు గత పాలకులు రూ.2,500 అందించగా దానిని సీఎం కేసీఆర్రూ. 6 వేలకు పెంచారు. కరోనా లాంటి విపత్కార పరిస్థితుల్లో సైతం వేతనం అందించారు. తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలయాల్లో పనిచేస్తున్న 395 మందికి బ్రాహ్మణులకు భరోసా కల్పించారు.
నేడు 290 ఆలయాల్లో అర్చకులకు డీడీఎన్ఎస్ ఉత్తర్వులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ధూప,దీప నైవేద్య పథకం ఆలయాలతోపాటు మరో 290 ఆలయాలకు ధూప, దీప నైవేద్య పథకం వర్తింప చేస్తూ ఉత్తర్వులు అందజేయనున్నారు. కాగా వీరికి ఇచ్చే వేతనం రూ. 6వేల నుంచి 10 వేలకు పెంచుతూ గత నెల 31న హైదరాబాద్లో జరిగిన బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో వెల్లడించగా త్వరలోనే అమలు కానుంది.
బ్రాహ్మణులకు సముచితస్థానం
గతంలో ఏ ప్రభుత్వం కల్పించని విధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అర్చక వేల్ఫేర్ బోర్డును ఏర్పాటు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. మరో వైపు ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు, ఉద్యోగులకు 010తో ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తున్నారు.
బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తింపు
తెలంగాణ సంస్కృతి, సంద్రాయాలను అద్దం పట్టే బోనాలు, బతుకమ్మ పండుగకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా గుర్తింపు కల్పించారు. బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే రాష్ట్రంలో అతి పెద్ద జాతరైన సమ్మక్క సారలమ్మ, సూర్యాపేట సమీపంలో దురాజ్పల్లి లింగమంతుల జాతరకు సౌకర్యాల కల్పనకు భారీగా నిధులు కేటాయించారు.
అధికారంగా ఏఏ ఆలయాల్లో అంటే
నల్లగొండ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వరం, నకిరేకల్ మండలం ఇనుపాముల పచ్చల సోమేశ్వరస్వామి ఆలయం, మునుగోడు మండలం తుమ్మలపల్లి శివాలయం, హాలియా సమీపంలోని పేరూరు శివాలయం, పీఏపల్లి మండలంలోని కోదండపురంలోగల వేంకటేశ్వర స్వామి ఆలయం దామర చర్ల మండల వాడపల్లి మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించనున్నారు.
నేడు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలకరించారు. నేడు మామిడి తోరణాలతో పచ్చని పందిళ్లు వేస్తారు. ఆలయాల్లో ప్రత్యేకాభిషేకాలు, పూజలు, సీఎం కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా సాగాలని వేద ఆశీర్వచనం చేయనున్నారు. ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమాల్లో మంత్రి జగదీశ్రెడ్డితోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
నేటి ఆధ్యాత్మిక దినోత్సవానికి ఏర్పాట్ల పరిశీలన
రామగిరి : పానగల్ చాయా సోమేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం మున్సిపాల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి పరిశీలించారు. ఆధ్యాత్మి వాతావారణంలో వేడుకలు జరిగేలా విజయవంతం కావాలన్నారు. ఈ వేడుకలకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రముఖులు హాజరుకానున్నారు. ఆయన వెంట ఆయల అభివృద్ది కమిటి చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, మున్సిపాలీసిబ్బంది, అదికారులున్నారు.
అర్చకులకు గుర్తింపునిచ్చింది కేసీఆర్ సారే
గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యానికి గురైన పురాతన ఆలయాలకు పునరుజ్జీవం పోసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిత్యం దైవారాధనలో ఉండే అర్చకులకు తగిన గుర్తింపునిచ్చి సమాజంలో గౌరవం కల్పించిండు కేసీఆర్ సార్. అన్ని వర్గాల ప్రజలతో సమానంగా అర్చకుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. దూప దీప నైవేద్య పథకాన్ని ప్రవేశపెట్టి అర్చకులకు ప్రతి నెలా రూ.6 వేలు చెల్లించడం హర్షణీయం. గతంలో భక్తులు సమర్పించే కానుకలతో కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. మేం చెప్పకున్నా మా కష్టాలను గుర్తించి వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డికి అర్చకులందరి తరపున ధన్యవాదాలు.
– వలివేటి వీరభద్రశర్మ, తెలంగాణ అర్చక ఉద్యోగ ఐక్య కార్యచరణ సమితి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు
సనాతన ధర్మపరిరక్షణలో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటిలేరు
సనాతన ధర్మపరిరక్షణలో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటి లేరు. సబ్బండ వర్గాల సమస్యలపై అవగాహన కలిగిన అపరమేథావి. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్, అర్చక వెల్ఫేర్ బోర్డుతో ప్రత్యేకంగా రూ.170 కోట్లు కేటాయించి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. పురాతన ఆలయాల వైభవానికి నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు యాదాద్రి ఆలయ పునఃనిర్మాణమే నిదర్శనం. సీఎం కేసీఆర్ ఫ్రభుత్వానికి బ్రాహ్మణులంతా ఎల్లవేళలా అండగా ఉండి మద్దతు తెలుపున్నారు.
– దౌలాతాబాద్ వాసుదేవ శర్మ, ధూప, దీప నైవేద్య పథకం రాష్ట్ర అధ్యక్షుడు,
వేడుకలకు సర్వం సిద్ధం చేశాం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధం చేశాం. ప్రతి నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. అక్కడ ప్రత్యేక హోమం, అభిషేకాలు, వేదపారాయణాలు, సాంస్కృతిక నిర్వహిస్తాం. భక్తులకు పలు ప్రాంతాల్లో అన్నప్రసాదం అందజేస్తాం
– మహేందర్కుమార్, అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ ధర్మాదాయశాఖ
బ్రాహ్మణుల పూర్తి ఆశీస్సులు సీఎం కేసీఆర్పై ఉంటాయి
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్ను రూపకల్పన చేసి, జీర్ణ వస్థంకు గ్రామీణ దేవాలయలకు దూప, దీప నైపథకం అమలుతో పేద బ్రాహ్మణుల్లో ఆత్మ విశ్వాసం పెంచిన బ్రాహ్మణ పక్షపతి సీఎం కేసీఆర్. స్వరాష్ట్రంలో సర్వమతాలకు ప్రాధాన్యత కల్పించి మతసామరాస్యానికి పెద్ద పీటవేస్తున్నారు. ఆయన ఎల్లపుడు అభివృద్ధి వైపు పయణిస్తూ సుఖసంతోషాలతో వారి ప్రభుత్వం ముందుకు సాగాలని నిత్యం బ్రాహ్మణులు వేద ఆశీర్వచనం చేస్తున్నారు. నేటి ఆధ్యాత్మిక దినోత్సవంలో అందరూ బ్రాహ్మణులు ఉత్సవంతో పాల్గొంటున్నారు.
– పెన్నా మోహన్శర్మ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, డీడీఎన్ఎస్ -తెలంగాణ