మునుగోడు నియోజక వర్గంలో గొర్రెల పంపిణీకి అధికారులు సిద్ధం చేశారు. నచ్చిన గొర్రెల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఉప ఎన్నికలో ప్రతిపక్షాల కుట్రతో అది ఆగిపోయింది. ఇప్పటికే డీడీలు చెల్లించిన లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా వెంటనే గొర్రెలు అందించాలని సర్కారు ఆదేశాలతో నల్లగొండ, యాదాద్రి జిల్లాల అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నేడో రేపో లబ్ధిదారులకు గొర్రెలు అందించనున్నది. మునుగోడు నియోజక వర్గంలో 7,661 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 4,719 మంది డీడీలు చెల్లించారు. వారికి తొలుత పంపిణీ చేయనున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని చేపట్టగా ఎన్నికల పేరుతో ప్రతిపక్షాల కుట్ర కారణంగా మధ్యలో ఆగిపోయింది. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రతి లబ్ధిదారుడికి గొర్రెలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధ్దిమైంది. ఇప్పటికే డీడీలు చెల్లించిన వారికి వెంటనే గొర్రెలు కొనుగోలు చేసి ఇవ్వాలని నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లను సర్కారు ఆదేశించడంతో పశుసంవర్ధ్దక శాఖ యంత్రాంగం అందుకు సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో అధికారులు లబ్ధిదారులతో గొర్రెలు కొనుగోలు చేయించి గ్రౌండింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డీడీలు కట్టిన వారికి పంపిణీ
నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఏడు మండలాల్లో రెండో విడుత కింద మొత్తం 7661 మంది లబ్ధిదారులు ఉండగా అందులో ఇప్పటి వరకు 4,719 మంది డీడీలు చెల్లించారు. వారికి ఈ వారంలో గొర్రెలు పంపిణీ చేసి తర్వాత మిగిలిన వారి నుంచి డీడీలు తీసుకొని వారికి కూడా పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తొలి విడుతలో గొర్రెల యూనిట్ కాస్ట్ రూ.1.25 లక్షలు ఉండగా ప్రస్తుతం జీవాల ధరలు పెరుగటంతో ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను కూడా రూ.1.75 లక్షలకు పెంచింది. ఇందులో ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ కింద రూ.1,31,250 ఇవ్వనుండగా లబ్ధిదారుడు తన వాటాగా రూ.43,750 చెల్లించాల్సి ఉంది. రెండో విడుతలో నగదు బదిలీ పథకం విజయవంతం అయితే రాష్ట్రం మొత్తం ఇదే పద్ధతిలో గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేయనున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రెండో విడుతలో లబ్ధ్దిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తే వారే తమకు నచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకుంటారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు, చండూరు, గట్టుప్పల్, నాంపల్లి, మర్రిగూడ, సంస్థాన్నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో తొలిసారిగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలు చేసింది. ఎన్నికల సమయంలో పలు కారణాలతో ఈ పథకం ఆగిపోయింది. అయితే సదరు పథకాన్ని సంక్రాంతి తర్వాత ప్రారంభించాలని సర్కారు అధికారులను ఆదేశించింది. దాంతో నేడో రేపో గొర్రెలు మునుగోడుకు రానున్నాయి. ఇప్పటికే డీడీలు చెల్లించిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. సదరు లబ్ధిదారులతో కలిసి పశు సంవర్ధకశాఖ అధికారులు వెళ్ల్లి గొర్రెలు కొనుగోలు చేసిన తర్వాత గ్రౌండింగ్ చేయనున్నారు.
ప్రతి పక్షాల కుట్రలతోనే ఆగిన పంపిణీ
గొర్రెల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడుతలో రైతు గొర్రెలు కొనుగోలు చేసిన తర్వాత అధికారులు చెక్కు రూపంలో కొనుగోలు చేసిన వ్యక్తికి డబ్బులు అందజేసేవారు. అయితే డబ్బులు తమకే ఇస్తే తామే నచ్చిన గొర్రెలు కొంటామని గొల్లకుర్మలు ప్రభుత్వానికి విన్నవించారు. దాంతో రెండో విడుతలో పైలట్ ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గంలో నగదు బదిలీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా లబ్ధిదారుల ఖాతాలు సేకరించి డబ్బులు జమ చేసింది. అయితే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్ని డబ్బులు లబ్ధిదారులకు అందకుండా వారి ఖాతాలను ఫ్రీజ్ చేయించాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే గొర్రెలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దాంతో ఈ ప్రక్రియ షురూ అయింది.
లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని ఆదేశించాం
రెండో విడుతలో భాగంగా గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీలో ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో యాదవుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ఈ పథకం అమలు చేయగా కొందరి కుట్రల వల్ల అప్పుడు ఆగిపోయింది. ఈ పథకంలో ఆలస్యం చేయవద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇరు జిల్లాల అధికారులతో మాట్లాడాం. త్వరగా గొర్రెలు అందించాలని ఆదేశించాం.
-దూదిమెట్ల బాలరాజుయాదవ్, షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ చైర్మన్
తొలుత డీడీలు కట్టిన వారికి
రెండో విడుత గొర్రెల పంపిణీ పథకం కింద పైలట్ ప్రాజెక్టులో భాగంగా మునుగోడు నియోజక వర్గంలోని మండలాల లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు డీడీలు కట్టిన వారికి వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ సూచనలకు అనుగుణంగా త్వరలో లబ్ధ్దిదారులతో వెళ్లి గొర్రెలు కొనుగోలు చేయాలని మండల పశు వైద్య అధికారులను ఆదేశించాం. రెండు, మూడు రోజుల్లో డీడీలు కట్టిన వారందరికీ గొర్రెలు అందిస్తాం.
– యాదగిరి, పశుసంవర్ధక శాఖ అధికారి, నల్లగొండ