యాదగిరిగుట్ట, జనవరి 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు. ఆలయ పశ్చిమ రాజగోపురం గుండా మాఢవీధుల్లో అరుణపారాయణాలు పఠిస్తూ సేవను ఊరేగించారు. తూర్పు రాజగోపురం వద్ద సేవను వేంచేపు చేసి స్వామివారి వైభవం, పుట్టు పుర్వోత్తరాలు, అలయ చరిత్రను ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులు తెలిపారు. సాయంత్రం స్వర్ణ రథంపై స్వామివారిని వేంచేపు చేసి సేవను కొనసాగించారు.
సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుడి వాహనాన్ని స్వామివారు అధిరోహించి భక్తులకు కటాక్షించారు. యాదగిరిగుట్ట ఆలయ పునః ప్రారంభం అనంతరం తొలిసారిగా స్వామివారు సూర్య జయంతిని పురస్కరించుకుని ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం స్వర్ణరథంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమాఢ వీధుల్లోకి చేరుకుని స్వామివారికి మంగళహారతులు పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్ శర్మ, ఆలయాధికారులు రఘు, ముద్దసాని నరేశ్ పాల్గొన్నారు.
పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు రెండోరోజు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి నిత్యారాధనల అనంతరం తిరుమంజన మహోత్సవం పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ప్రబంధ పాశురాలను పఠిస్తూ పురప్పాట్ సేవను నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బాజాభజంత్రీలతో ఊరేగించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లోని పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. సాయంకాలం నిత్యారాధనల అనంతరం దివ్య ప్రబంధాన్ని పారాయణికులు పఠిస్తూ పురప్పాట్ సేవను నిర్వహించారు. స్వామివారి సేవను ఆలయంలో బాజాభజంత్రీలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆళ్వారులు కీర్తించిన ప్రబంధాల్లో పాశురాలను అనుసంధానం చేశారు. ప్రత్యేక రుత్వికులు, పండితులు సేవల ఎదుట శాస్ర్తోక్తంగా పాశురాలను పఠించారు. వేడుకల్లో ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారిని ఒడిస్సా రాష్ర్టానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ స్వాయ్, ప్రహ్లాద్ సాహూ, త్రిలోచన్ పంఢా, గోవింద సాహూ, కృష్ణ చంద్ర బెహరా, బిరాజ్ రావుత్, అశోక్ స్వాయ్, ప్రసన్నకుమార్ కునార్, అశోక్కుమార్, సుశీల్కుమార్, వైద్యనాథ్ రథోతో పాటు 21మంది బీఆర్ఎస్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణాలు పరిశీలించి నిర్మాణాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ గొప్ప దూరదృష్టి గల వ్యక్తి అని కొనియాడారు. స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు.
స్వయంభూ నారసింహుడికి నిత్యార్చనలు తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవాలయ ప్రాంగణం, మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల వద్ద సందడి నెలకొంది. నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెల్లవారుజామున 3:30 గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొలిపారు. తిరువారాధన, బాలభోగం, నిజాభిషేకం, సహస్రనామార్చన అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం తిరువీధి సేవోత్సవం, దర్భార్ సేవ, అర్చనలు, శయనోత్సవ సేవను పాంచరాత్రగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. ధర్మ దర్శనానికి 2 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.27,18,956 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదగిరిగుట్ట కొండ కింద ఉత్తర ప్రాంతంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి శనివారం పరిశీలించారు. పార్కింగ్, నూతన బస్టాండ్ ప్రాంగణం నిర్మాణంలో ఉన్న షాపింగ్ భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిపై ఆర్అండ్ బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 2,57,700
వీఐపీ దర్శనాలు 1,20,000
బ్రేక్ దర్శనాలు 1,74,600
వేద ఆశీర్వచనం 10,800
సుప్రభాతం 4,500
ప్రచార శాఖ 25,150
వ్రత పూజలు 1,76,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 72,500
ప్రసాద విక్రయం 12,10,950
వాహనపూజలు 13,500
అన్నదాన విరాళం 16,448
శాశ్వత పూజలు 37,500
సువర్ణ పుష్పార్చన 97,664
యాదరుషి నిలయం 85,444
పాతగుట్ట నుంచి 23,660
కొండపైకి వాహన ప్రవేశం 3,50,000
పుష్కరిణి 1,650
శివాలయం 7,600
ఇతర విభాగాలు 33,290