సూర్యాపేట సిటీ, డిసెంబర్ 2 : జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్టులో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. శనివారం బందోబస్తును పరిశీలించి మాట్లాడారు. మొత్తం 800 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు.
144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా చేరవద్దని సూచించారు. ప్రజలు, రాజకీయ ప్రతినిధులు సహకరించాలని కోరారు. రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డు భద్రతా సిబ్బందికి చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశం ఉంటుందన్నారు. మోబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్, లైటర్ల వంటి నిషేదిత వస్తువులను కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం లేదన్నారు.
మూడు సెక్టార్స్లో మూడంచల భద్రత ఏర్పాటు చేసినట్లు, 12 సెక్షన్లలో పారా మిలటరీ సిబ్బంది, 50 మంది స్టేట్ ఆర్మూడ్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ 1, డీఎస్పీ 4, సీఐలు 14, ఎస్ఐలు 40, ఏఎస్ఐ, హెచ్సీ, పీసీ, హెచ్జీ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, బాణాసంచా, డీజేలను నిషేదించినట్లు పేర్కొన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ నాగభూషణం, రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజేశ్, పట్టణ సీఐ రాజశేఖర్, రూరల్ సీఐ అశోక్రెడ్డి, ఆర్ఐ నారాయణ ఉన్నారు.