అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. తమ పేగు బంధం కలకాలం నిలువాలని కోరుకుంటూ సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షా బంధన్. గురువారం రాఖీ పౌర్ణమిని జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. బంధువులు, కుటుంబ సభ్యులతో ఇంటింటా సందడి మొదలైంది. బుధవారం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులతో రోడ్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. రాఖీలు, స్వీట్లు కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి. రాఖీ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పండుగశుభాకాంక్షలు తెలిపారు. రాఖీతో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానుబంధం మరింత బలోపేతం కావాలని, ప్రజల మధ్య సోదరభావం పెంపొందాలని వారు ఆకాంక్షించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం రాఖీ సందడి నెలకొన్నది. గురువారం రక్షాబంధన్ వేడుకలు ఉండగా.. మహిళలు, యువతులు తమ సోదరులకు కట్టేందుకు రాఖీల కొనుగోళ్ల కోసం మార్కెట్లోకి వచ్చారు. దాంతో పట్టణాల్లోని రాఖీ సెంటర్లతోపాటు స్వీట్ దుకాణాలు కోలాహలంగా మారాయి. కొందరు సొంతూళ్ల్లకు బయల్దేరడంతో బస్టాండ్లు రద్దీగా కనిపించాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ముందస్తుగా రాఖీ వేడుకలు జరుపుకొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 30
జిల్లా ప్రజలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని బంధాల్లో అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సోదర సోదరీమణులంతా రాఖీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సూర్యాపేట టౌన్, ఆగస్టు 30 : సోదరభావానికి నిలువెత్తు నిదర్శనం రాఖీ పౌర్ణమి అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్గో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రజల మధ్య సోదరభావం మరింతగా ఫరిడవిల్లాలని ఆకాంక్షించారు. సోదరభావంతో, ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి రోజున రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే పండుగగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఆనాదిగా కొనసాగుతున్న ఆచారం రాఖీ పౌర్ణమి అని పేర్కొన్నారు.