నాంపల్లి, అక్టోబర్ 19 : ‘మునుగోడు బిడ్డను నేను.. నన్ను ఆశీర్వదించి ఆదరించండి. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తా. నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాంపల్లి మండలంలోని గానుగుపల్లి, మహమ్మదాపురం, గట్ల మల్లేపల్లి, తుమ్మలపల్లి రేవెల్లి, మేళ్లవాయి, ఫకీర్పురం(పులికుంట్ల), సుంకిశాల, బండతిమ్మాపురం, పగిడిపల్లి, రాజ్యతండా, ముష్టిపల్లి గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల మాట్లాడుతూ రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని చిత్తుగా ఓడించాలన్నారు. ఆయన మోసపూరిత వాగ్దానం తప్ప ప్రజలకు చేసేదేమీ ఉండదని విమర్శించారు.
మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెట్టిన నీచుడు, నియోజకవర్గంలో ఓటు లేని వ్యక్తికి మనమెందుకు ఓటేయాలని ప్రశ్నించారు. రాజగోపాల్రెడ్డి మోసపూరిత మాటలు నమ్మొద్దని, యువత చౌతన్యంతో ఆలోచించాలని సూచించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లిచ్చి ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమికొట్టిన సీఎం కేసీఆర్.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. 2వేల కోట్లతో 20 టీఎంసీల సామర్థ్యం గల శివన్నగూడెం లక్ష్మణాపురం ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని, వాటి ద్వారా నియోజకవర్గంలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. యువత చైతన్యంతో ఆలోచించి కేసీఆర్ నాయకత్వానికి అండగా ఉండాలని కోరారు. సంక్షేమ పథకాలను ఆపాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. ఆయనను గెలిపిస్తే సంక్షేమ పథకాలు ఆగే ప్రమాదం ఉందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మునుగోడు అభివృద్ధి చెందిందని, రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మొసలి కన్నీరు కారుస్తూ మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న రాజగోపాల్రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. తనను మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ప్రచారంలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మెదక్, మంచిర్యాల ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, నడిపెల్లి దివాకర్రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, ఎంపీపీ శ్వేతారవీందర్రెడ్డి, జడ్పీటీసీ ఏవీ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గానికి రాజగోపాల్ చేసిందేమీ లేదు
18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం మోదీకి అమ్ముడుపోయిన దొంగ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. ఏనాడూ నియోజకవర్గ సమస్యలు పట్టని వ్యక్తి. మళ్లీ ఓట్లు అడగడానికి వెళ్తే గ్రామగ్రామాన ప్రజలు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలోకి వెళ్లి నిధులు ఎక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తాడో సమాధానం చెప్పాలి.
– మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి
ఇండ్లు కూలగొట్టే బుల్డోజర్ పార్టీ బీజేపీ
బీజేపీ.. పేదల ఇండ్లను కూలగొట్టే బుల్డోజర్ పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కారు గుర్తుకు ఓటెయ్యాలి. బీజేపీకి ఓటు వేస్తే పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఆగిపోతాయి. మతోన్మాద బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పాలి.
– జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నాయకుడు
ఫ్లోరోసిస్ను తరిమికొట్టిన ఘనత టీఆర్ఎస్దే..
మునుగోడు నియోజకవర్గంలో గతంలో ఫ్లోరోసిస్ భూతంతో కాళ్లు, చేతులు వంకర్లు పోయి మంచాలకే పరిమితమైన ఎంతో మంది చనిపోతుంటే కేసీఆర్ చలించిపోయారు. అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ తాగునీరు అందించి ఫ్లోరోసిస్ను పూర్తిగా తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్దే. నియోజకవర్గంలో సాగు నీరు అందించడానికి రెండు భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. అవి త్వరగా పూర్తి కావాలంటే ముఖ్యమంత్రి ఆశీర్వదించి పంపిన ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
– రమావత్ రవీంద్రకుమార్, దేవరకొండ ఎమ్మెల్యే
ఏం జేసినవని మా ఊరికొచ్చినవ్?
రాజగోపాల్రెడ్డిని నిలదీసిన సత్తెమ్మ
‘నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా ఊరికి ఏం జేసినవ్. మల్ల ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నవ్’ అంటూ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తంగెడపల్లిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాగోపాల్రెడ్డిని సత్తెమ్మ అనే మహిళ నిలదీసింది. ‘పోయిన ఎన్నికల్ల బీజేపీ దొంగల పార్టీ అన్నవ్.. ఇప్పుడు అదే దొంగల పార్టీల కలిసినవ్. రాజగోపాల్ మాటలు విని బీజేపీకి ఓటేస్తే మా కొంపలు మునిగినట్టే’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమ్ముడుపోయినప్పుడు రాజగోపాల్కు ప్రజలు గుర్తుకు రాలేదా?
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి.. ప్యాకేజీ కోసం బీజేపీకి అమ్ముడుపోయినప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా? ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలను ఎలా మోసం చేయాలనిపించింది. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిన బీజేపీతో అభివృద్ధి ఎట్లా జరుగుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే ప్రభుత్వం నుంచి నిధులు భారీగా వస్తాయి. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి.
– పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
టీఆర్ఎస్ వైపే మునుగోడు ప్రజలు
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుతుంది. దేశంలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తున్న టీఆర్ఎస్ పార్టీనే మునుగోడు ప్రజలు ఆదరిస్తారు. మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం.
– ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి