సూర్యాపేట, మే 29 : సూర్యాపేట జిల్లాలో వానకాలం సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సుమారు 6,24,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా అందులో 4,65,500 ఎకరాల్లో వరి ఉండనున్నది. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పత్తి, కంది, పెసర, ఆయిల్ పామ్ సాగు పెంచే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
వర్షాకాలం ప్రారంభానికి ముందే అధికారులు సాగు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏ పంటలు.. ఎంత వేయాలి.. ఎరువులు, విత్తనాలు ఎంత మొత్తంలో దిగుమతి చేసుకోవాలని పక్క ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. సూర్యాపేట జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతున్నది.సూర్యాపేట జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ నీళ్లతో రెండు పంటలకు సాగు నీరు అందుతున్నది. రైతులు ఆ నీటిని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తున్నారు. పంటల పెట్టుబడికి ప్రభుత్వం ముందుగానే రైతుబంధు ఇస్తుండడంతో అప్పులు తెచ్చే బాధ లేదు. దీంతో రైతులు సైతం ఉత్సాహంగా పంటలు సాగు చేస్తున్నారు. అదే స్థాయిలో అధికారులు పంటల ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసి రైతులకు అండగా నిలుస్తున్నారు. 2023 వానకాలం సాగు ప్రణాళికను అధికారులు సిద్దం చేశారు. సూర్యాపేట జిల్లాలో 6,24,280 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయనున్నారు. గత వానకాలం సూర్యాపేట జిల్లాలో 6,15,965 ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఈ సారి కొంత మేర పెరిగింది. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలను, ఎరువులను సైతం అధికారులు ముందస్తుగానే ప్రణాళికబద్ధంగా తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యాపేట జిల్లాకు ఐదు రకాల ఎరువులు కలిపి 1,41,722మెట్రిక్ టన్నులు అవసరం పడుతుండగా సుమారు 34,222 మెట్రిక్ టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. సాగు ప్రారంభం నాటికి అవసరమైన ఎరువులు తెప్పిస్తున్నారు.
వరి, పత్తి సాగే అధికం
సూర్యాపేట జిల్లాలో వరి అధికంగా సాగు అవుతుండగా ఆ తర్వాత పత్తి సాగవుతుంది. జిల్లా వ్యాప్తంగా 6,24,280ఎకరాల్లో మొత్తం పంటలు సాగవుతుందని అంచనా వేయగా అందులో వరి సాగే సుమారు 4,65,500ఎకరాలు ఉంది. పత్తి 1,12,500ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేశారు. వరి సాగుకు 96,450క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేసి వాటిని సిద్ధం చేస్తున్నారు. పత్తి సాగుకు సైతం 475 గ్రాముల ప్యాకెట్లు దాదాపు 2,25,000 అవసరం కానున్నాయి.
ఆరుతడి పంటల సాగుకు..
సూర్యాపేట జిల్లాలో గతంలో ఆరుతడి పంటల సాగు అధికంగా చేసేవారు. ప్రస్తుతం నీటి లభ్యత పెరగడంతో ఈ సాగు గణనీయంగా తగ్గింది. గతంలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 60వేల ఎకరాల్లో పెసర, కంది సాగు చేసేవారు ప్రస్తుతం 10వేల ఎకరాలు దాటే పరిస్థితి లేదు. పత్తి సాగు సైతం దాదాపు 40 శాతం తగ్గింది. ఆరుతడి పంటల వైపు రైతులను మళ్లించేందుకు అధికారులు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతేడాది సాగు కంటే కొంత మేర పెంచాలని నిర్ణయించారు.
ఆరు తడి పంటల సాగుకు ముందుకురావాలి
సాగుకు నీరు అధికంగా ఉండడంతో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ఆరుతడి పంటలకు సైతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రైతులు ఆరుతడి పంటల సాగుకు ముందుకు రావాలి. గతేడాది జిల్లాలో సాగైన పంటల ఆధారంగానే ఈ సారి పంటల ప్రణాళిక సిద్ధం చేశాం. పంటలకు అనుగుణంగా ఎరువుల డిమాండ్ను సైతం లెక్కించాం. రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచుతాం. వానాకాలం సాగుకు ముందు వ్యవసాయాధికారుల సలహాలు తీసుకుని పంటలు సాగు చేయాలి.
– రామారావునాయక్ , సూర్యాపేట డీఏఓ