మిర్యాలగూడ, జనవరి 13 : మిర్యాలగూడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. దాంతో రియల్ వ్యాపారుల కన్ను పట్టణ పరిసర ప్రాంతాల భూములపై పడింది. మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం గ్రామ శివారులో ప్రభుత్వం 50 మంది నిరుపేద రైతులకు ఇచ్చిన 26 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు.
జప్తివీరప్పగూడెం గ్రామ శివారులో 214 సర్వే నంబరులో ఉన్న 26 ఎకరాల భూమిని ఇప్పటి ప్రభుత్వం 50 మంది రైతులకు అసైండ్ పట్టాలు ఇచ్చింది. 2006లో కోరమండల్ కంపనీ గ్రామంలో చక్కెర ఫ్యాక్టరీ స్థాపిస్తామని చెప్పి గ్రామంలోని 213, 215 సర్వే నంబర్లో ఉన్న 110 ఎకరాల పట్టాభూమిని కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రైతులను మభ్యపెట్టిన కంపెనీ యాజమాన్యం అసైన్డ్ భూమి పట్టాదారుల నుంచి 26ఎకరాల అసైన్డ్ పట్టా భూములను సైతం నామమాత్రపు ధరలకు కొనుగోలు చేసింది. కానీ చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులు అడిగితే మాత్రం రేపు మాపు అంటూ కాలం వెళ్లదీసింది. 16 ఏండ్లుగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవటంతో అటు ఉద్యోగాలు రాక, ఇటు ప్రభుత్వం ఇచ్చిన భూములు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పేద రైతులు భూములు సాగు చేసుకొని జీవనం సాగించేందుకు ప్రభుత్వం 26 ఎకరాల భూమిని 50 మంది రైతులకు ఇచ్చింది. కానీ కంపనీ కోరమాండల్ యాజమాన్యం ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు అసైన్డ్ భూములను కంపనీ వారికి ఇచ్చారు. సదరు కంపెనీ యాజమాన్యం చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోగా ఇటీవల హైదరాబాద్కు చెందిన రియల్ వ్యాపారికి భూమిని విక్రయించింది. సదరు రియల్ వ్యాపారి ఆ భూముల్లో ప్లాట్ల దందా ప్రారంభించాడు. అయితే ప్రభుత్వం ఇచ్చిన భూమిని రైతులు కేవలం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి నిర్మాణాలకూ అనుమతి ఉండదు. కానీ రియల్ వ్యాపారి మాత్రం అందులో ఇండ్లు, ఆస్పత్రి, స్కూల్ నిర్మిస్తామంటూ ప్రజలను మభ్యపెడుతూ ప్లాట్లు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
ఇంతకాలం చక్కెర ఫ్యాక్టరీ నిర్మించి ఉద్యోగాలు ఇస్తామని అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులను మభ్యపెట్టిన కోరమాండల్ కంపనీ ప్రస్తుతం భూమిని రియల్ వ్యాపారికి విక్రయించగా అతను కొత్త హామీలు మొదలు పెట్టాడు. వెంచర్లో 10 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ స్థాయి గురుకులం, మరో 10 ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించి రైతులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రియల్ వ్యాపారం ప్రారంభించాడు.
గ్రామంలో 110 ఎకరాల పట్టా భూమిని ఆనుకొని ఉన్న 26 ఎకరాల అసైన్డ్ భూమిని తెలివిగా దక్కించుకునేందుకు పట్టా భూమిలో వెంచరు ఏర్పాటుచేసి ప్లాట్ల విక్రయాలు మొదలుపెట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం మ్యాప్ చూపించి ప్లాట్లు విక్రయిస్తున్నారు. బ్రోకర్ల ద్వారా మ్యాప్ మీదనే ప్లాట్ నంబర్లు చూపించి విక్రయాలు జరుపుతున్నారు. ప్రస్తుత రేటు ప్రకారం అసైండ్ భూమి విలువ సుమారు రూ. 7 కోట్ల పైగానే ఉంటుంది. సదరు భూమి సాగర్ ఆయకట్టు కిందికి వస్తుంది. అయితే మాయమాటలు చెప్పి కంపెనీవారు, తర్వాత రియల్ఎస్టేట్ వ్యాపారి స్వాధీనం చేసుకున్న భూమికి చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు భూ మిలేక.. ఇటు ఉద్యోగాలు రాక ఉపాధి కరువై దుర్భర జీవనం సాగిస్తున్నారు.
మండలంలోని 214 సర్వేనంబరులో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటాం. ఈ భూమి అమ్మడానికి, కొనడానికి ఎవరికీ హక్కులు లేవు. అసైన్డ్ భూమిని రైతులు సాగు చేసుకొని ఉపాధి పొందాలే తప్ప విక్రయించేందుకు నిబంధనలు ఒప్పుకోవు. రైతులు సాగు చేయకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటాం.
– అనిల్కుమార్, ఇన్చార్జి తాసీల్దార్, మిర్యాలగూడ
జప్తివీరప్పగూడెంలో చేసిన వెంచర్కు ఇంకా డీటీసీపీ అనుమతులు రాలేదు. కేవలం 30 ఎకరాలకు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. డీటీసీపీ అనుమతి రావాలంటే గ్రామపంచాయతీకి 10 శాతం భూమి రిజిస్ట్రేషన్ చేయాలి. లే అవుట్లో మౌలిక వసతులు కల్పించాలి. ఇవి చేసే వరకు వెంచరులో 15 శాతం భూమిని పంచాయతీకి మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా ప్లాట్లు చేస్తే చర్యలు తీసుకుంటాం.
– వీరారెడ్డి, మండల పంచాయతీ అధికారి, మిర్యాలగూడ