నల్లగొండ : సర్కార్ బడుల బలోపేతానికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాలలో మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా రూ. కోటి 30 లక్షల పై చిలుకు వ్యయంతో చేపట్టనున్న పలు అభివృధ్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఆయన కలియ తిరిగి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. విద్యా రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక నిధులను తీసుకొచ్చారన్నారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించాలని సూచించారు. ఉపాధ్యాయులు భాద్యతగా వ్యవహరించాలని అన్నారు.
ఉపాధ్యాయులు, తల్లితండ్రులు విద్యార్థుల ఇష్టాలను గుర్తించాలని, సెల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై తల్లితండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పాఠశాలకు కావాల్సిన సీసీ కెమెరాలను వారం రోజుల్లోపు ఏర్పాటు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.