యాదాద్రి భువనగిరి, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో రీడింగ్ కల్చర్ ప్రోత్సాహానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. పౌరుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలను నెలకొల్పుతున్నది. నిరుపయోగంగా ఉన్న భవనాలకు మరమ్మతులు చేపట్టి వాటిల్లో పౌర పఠన మందిరాలను ఏర్పాటు చేస్తున్నది. జిల్లాలోని 83 గ్రామాల్లో పబ్లిక్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వీటిని మూడు దశల్లో అందుబాటులోకి తేవాలని భావించారు. అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ పర్యవేక్షణలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను కొత్త లైబ్రరీల కోసం ఉపయోగిస్తున్నారు.
ఒక్కో లైబ్రరీకి 1.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. గ్రంథాలయంలో పుస్తకాలు, పీరియాడికల్స్ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే భువనగిరి పట్టణ పరిధిలోని సింగన్నగూడెం, 26వ వార్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం, రాజాపేట, రామన్నపేట మండలంలోని ఇంద్రపాల నగరం, మోత్కూరు మున్సిపాలిటీలోని కొండాపురంలో అన్ని హంగులతో పౌర పఠన మందిరాలను తీర్చిదిద్దారు. ఇప్పటి వరకు జిల్లాలో ఏడు పబ్లిక్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలో మరో మూడు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.
అన్ని వసతులతో..
గ్రంథాలయాల్లో అన్ని వసతులు కల్పించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో లైబ్రరీకి 1.40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. టేబుళ్లు, ఫ్యాన్లు, కుర్చీలు, లైట్లు వేశారు. అన్ని వయసుల వారు చదువుకునేలా పబ్లిక్ లైబ్రరీలను తీర్చిదిద్దుతున్నారు. పలుచోట్ల ప్రారంభించడంతో విద్యార్థులు, యువత, వృద్ధులు చదువుకునేందుకు తరలివస్తున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగులకు సైతం ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ నెల 16న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం సింగన్నగూడెం పబ్లిక్ లైబ్రరీని సందర్శించి ప్రశంసించారు.