నల్లగొండ, జనవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో 8 రోజులుగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తొలి రోజు అంతంత మాత్రంగానే దరఖాస్తులు రాగా.. చివరి రోజు వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. చివరి రోజు శనివారం మూడు జిల్లాల్లో కలిపి లక్షా 53వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,730 గ్రామపంచాయతీలు, 18 మున్సిపాలిటీల్లో ఈ దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దరఖాస్తుల స్వీకరణను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
ఎన్నికల హామీలో భాగంగా ఆరు గ్యారెంటీల అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 28 నుంచి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. రెండు రోజుల సెలవులు పోను 8 రోజులు ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో కౌంటర్ ఇన్చార్జిలు బాధ్యత తీసుకుని దరఖాస్తు ఫారాలు అందజేసి ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ ప్రతులతో కలిపి స్వీకరించారు.
ఈ దరఖాస్తుల్లో కుటుంబ వివరాలతోపాటు దరఖాస్తులకు అవసరమైన అంశాలను పొందుపరుస్తూ వాటి వివరాలను సేకరించారు. మహాలక్ష్మి పథకం కింద గృహిణికి రూ.2,500 ఆర్థిక సాయంతోపాటు ఉచిత గ్యాస్ కనెక్షన్, రైతు భరోసా కింద రైతు, కౌలురైతులకు పెట్టుబడి సాయం.. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూతకు సంబంధించిన డేటాను పూర్తిస్థాయిలో సేకరించారు. ఈ సందర్భంగా ప్రజలు రేషన్ కార్డుతోపాటు ఆధార్ జిరాక్స్లను జత చేసి ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభల్లో అందజేశారు.
అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న ప్రజలు అయోమయంలో పడ్డారు. వాస్తవంగా ఆధార్, రేషన్ కార్డులు ఒక ప్రాంతంలో ఉన్నప్పటికీ కొంత మంది ఏండ్ల తరబడి ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. అటువంటి వారు సంబంధిత ధ్రువపత్రాలు ఉన్న ప్రాంతంలో దరఖాస్తు చేసుకోవాలా.. ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో దరఖాస్తు చేసుకోవాలా? తెలియక అయోమయానికి గురయ్యారు. ప్రధానంగా సొంత ఇల్లు లేనివారు ఇందిరమ్మ ఇంటి కోసం ఉన్న ఊరిలో, జీవనం సాగిస్తున్న ప్రాంతంలో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో అర్థ్ధంకాని పరిస్థితి నెలకొంది.
గృహజ్యోతి పథకంలో 200 యూనిట్లు ఉచితంగా ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో అద్దె ఇంట్లో ఉన్నవారు ఆ ఇంటి విద్యుత్ కనెక్షన్ నెంబర్ వేస్తే ఎలా.. ఆ తరువాత ఖాళీ చేస్తే వర్తిస్తుందో.. లేదోననే మీమాంసలో ఆ ఆప్షన్ను వదిలేశారు. రైతు భరోసాలో వాస్తవంగా కౌలు రైతులు భూమి కౌలుకు చేస్తున్నప్పటికీ అసలు రైతులు సర్వే నెంబర్ చెప్పడానికి ఇష్టపడకపోవడంతో కౌలు రైతు ఆప్షన్ను వదిలేశారు. గ్యాస్ వినియోగదారుల కనెక్షన్ స్వస్థలంలో ఉండి ఇతర ప్రాంతాల్లో నివాసముంటే వారు కూడా వర్తించదేమోనని ఆ ఆప్షన్ను వదిలేసినట్లు తెలుస్తున్నది.