అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్రగతిలో నేడు దేశానికే ఆదర్శంగా రాష్ట్రం నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సూర్యాపేట మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని, మన దగ్గరికే ఇతర రాష్ర్టాల నుంచి కార్మికులు వలస వచ్చేలా ఎదిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పండుగలా జరుపుకోవాలని, ప్రజలు గ్రామ గ్రామాన పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్కు ఇతర రాష్ర్టాల్లో ఆదరణ పెరిగిందని, సీఎం కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. గులాబీ జెండా సాధించిన విజయాలను, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ చేరవేసేలా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
– సూర్యాపేట రూరల్, మే 28
సూర్యాపేట రూరల్, మే 28 : తెలంగాణ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణ పరిధిలోని సీతారామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూర్యాపేట మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొమ్మిదేండ్లలో అరవై ఏండ్ల దీర్ఘకాలిక అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ఒక్క గులాబీ జెండానే కారణమన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఏర్పాటయ్యేది కాదన్నారు. రాష్ట్ర ఏర్పాటుతోపాటు అభివృద్ధితో ఇతర రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది వలసలు వస్తే ఆతిథ్యం ఇస్తుందన్నారు. పండుగలా జరిపే దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడంతోపాటు ఊరూరూ కదలిరావాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతిపిన్న వయస్సు గల రాష్ట్రమని, అయినా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో, సమష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలు సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేడు తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ర్టాల నాయకులు, ప్రజలు మన రాష్ట్ర అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారన్నారు. చంద్రబాబునాయుడు తొత్తు, పిట్టల దొర పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, కేసీఆర్ కాలిగోటికి సరిపోనోడు తెలంగాణ ఫెయిల్యూర్ అనడంలో అర్థం లేదన్నారు. పాత బాస్ చంద్రబాబు, కొత్త బాస్ రాహుల్గాంధీతో తెలంగాణను నాశనం చేశారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో మూసీ ప్రాజెక్ట్ను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని పేర్కొన్నారు. ప్రజల పరీక్షల్లో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, బీఆర్ఎస్ మహిళా విభాగం మండలాధ్యక్షురాలు ముక్కాముల పద్మ, బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి వెంకటేశ్వర్రావు, ఈదుల యాదగిరి, ముదిరెడ్డి సంతోష్రెడ్డి, దశరథ, గాలిబ్, కవిత, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.