గ్యాస్ ధరల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కార్పై జనం భగ్గుమన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకు ప్రజల జీవితాలను ఫణంగా పెడుతున్నారంటూ మోదీ తీరుపై తిరుగబడ్డారు. ఓడ దిగాక బోడి మల్లయ్య అన్నట్లుగా ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్నికలు ముగియగానే ప్రజలపై భారాన్ని మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల ధర పెంపుపై బీఆర్ఎస్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లా అంతటా నిరసనలు కొనసాగాయి. బీఆర్ఎస్ శ్రేణులతోపాటు మహిళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి కదం తొక్కారు. మండల కేంద్రాల్లో ఖాళీ సిలిండర్లతో ర్యాలీలు నిర్వహించి ప్రధాన రహదారులపై
బైఠాయించి ఆందోళనకు దిగారు. సిలిండర్లను పక్కనేసి, రోడ్లపైనే కట్టెల పొయ్యిలు వెలిగించి వంట చేసి నిరసనలు తెలిపారు. మోదీకి అచ్చేదిన్..సామాన్యులకు సచ్చేదిన్.. మోదీ క్విట్.. యూ ఆర్ అన్ఫిట్.. బీజేపీ హఠావో.. భారత్ బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్రం, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో చేపట్టిన నిరసనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి పాల్గొన్నారు. మోత్కూరులో ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం అన్ని
నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దఎత్తున ఆందోళనలకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. మోదీ సర్కార్పై పోరులో ప్రజలతో కలిసి పార్టీ శ్రేణులంతా కదం తొక్కాలని జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
వంట గ్యాస్ ధర పెంపునకు నిరసనగా కేంద్ర సర్కారుపై నారీలోకం భగ్గుమన్నది. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అంతటా రోడ్డెక్కి సిలిండర్లు ప్రదర్శించి ధర్నాలు చేశారు. రహదారులపై కట్టెల పొయ్యితో వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ‘మోదీ క్విట్.. యూ ఆర్ అన్ఫిట్’, ‘బీజేపీ హఠావో.. భారత్ బచావో’ వంటి ప్లకార్డులతో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.– యాదాద్రి భువనగిరి, మార్చి 2
(నమస్తే తెలంగాణ)
ప్రజలపై తరచూ భారాలు మోపుతున్న కేంద్ర సర్కార్.. తాజాగా వంట గ్యాస్పై రూ.50, కమర్షియల్ గ్యాస్ బండపై రూ.350 పెంచడంపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళన బాట పట్టారు. పార్టీ శ్రేణులు, సామన్య ప్రజలు, చిరు వ్యాపారులతో కలిసి ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. పట్టణ, మండల కేంద్రాల్లోని ముఖ్య కూడళ్లు ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లాయి. నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. నార్కట్పల్లిలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నేతృత్వంలో ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. మహిళలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రోడ్డుపై ఖాళీ సిలిండర్లను పక్కనపెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన చేపట్టారు. మోదీకి అచ్చేదిన్.. పేదలకు సచ్చేదిన్ అంటూ ప్లకార్డులతో నినదించారు. నకిరేకల్లోని ప్రధాన కూడలిలో బీఆర్ఎస్ శ్రేణులు మహిళలు, చిరు వ్యాపారులతో కలిసి ఖాళీ సిలిండర్లతో ధర్నా చేశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొని మోదీ సర్కార్ తీరును ఖండించారు. సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేయడమే లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్యాల, కేతేపల్లి, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల్లో పార్టీ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. మునుగోడు నియోజకవర్గంలో శుక్రవారం ఆందోళనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.
గుట్ట వద్ద నిరసనల్లో
యాదగిరిగుట్టలో లక్ష్మీనర్సింహస్వామి పాదాల వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పాల్గొన్నారు. మోత్కూరులో నిర్వహించిన ధర్నాలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ప్రజలపై భారాలు మోపుతున్న బీజేపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. నేడు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనలకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసింది. నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులంతా మహిళలు, ప్రజలతో తరలి వచ్చి ఆందోళనల్లో పాల్గొననున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్, హాలియా, దేవరకొండ, మునుగోడు కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆందోళనలకు ప్లాన్ చేశారు. నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో జరిగే ఆందోళనలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. అన్ని చోట్లా ఖాళీ సిలిండర్లతో ర్యాలీలు నిర్వహించి కట్టెల పొయ్యిలతో పాటు ఇతర రూపాల్లో నిరసనలు తెలిపేందుకు సన్నద్ధమయ్యారు. మోదీ సర్కార్పై పోరులో ప్రజలను భాగస్వాములను చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.