కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నదని, రైతులు అప్రమత్తతో నిష్టాన్ని నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. క్రిమిసంహారక మందులను మోతాదు తగ్గట్టు వాడితే అధిక దిగుబడి వచ్చి, ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.
కంది పంటలో పూత దశ కీలకమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి ఉన్నా, అవసరానికి మించి ఎక్కువ తడి ఇచ్చినా పూత రాలి దిగుబడి తగ్గుతుంది. ఈ క్రమంలో పూత దశలో ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తిరుమలగిరి వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు వివరించారు. పూత రాలుడు నివారణకు 8-10 లీటర్ల నీటికి ప్లానోఫిక్స్ 2మి.లీ. చొప్పున కలిపి 10రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
కంది పూత దశలో ఉన్నప్పుడు ఎర్రని లేదా నారింజ రంగు మచ్చలు, నల్లని గీతలు ఉన్న పెంకు పురుగులు ఆశించి మొగ్గలను తింటాయి. దీంతో కాత తగ్గిపోతుంది. ఈ పురుగులను గమనించిన వెంటనే ఉదయం పూట వాటిని ఏరి మంటలో కాల్చివేయాలి.
ఇది సాధారణంగా పంట పెరిగే దశలో ఆశించి నష్టపరుస్తుంది. కాని కొన్ని సమయాల్లో పూత దశలోనూ దీని ప్రభావం ఉంటుంది. లద్దెపురుగు పూత దశలో పూతను గూడులా చేసి లోపలి పదార్థ్దాలను తింటుంది. కాయలు తయారు అయ్యేటప్పుడు మొగ్గలను దగ్గరగా చేర్చి గూడు కడుతుంది. కాయలకు రంధ్రం చేసి లొపలి గింజలు తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం జరుగుతుంది. విత్తనం మొలకెత్తే దశలో ఈ పురుగు ఆశిస్తే పంటకాలం మొత్తం దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. తద్వారా పంట తీవ్రంగా నష్టపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2.మి.లీ. చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేయాలి.
ఈ పురుగు లార్వాలు ఆకులను, పూతను, కాయలను కలిపి గూడులా చేసి తింటాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్, ఒక మి.లీ. డైక్లోరోవాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే 10లీటర్ల నీటికి స్పైనోసాడ్ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
కంది కాయలు ఎండిన తరువాత మాత్రమే పంటను కోయాలి. కారణం పూత రెండు నెలల వరకు వస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కల్లెతో కొట్టి కాయల నుంచి గింజలను వేరు చేయాలి. కందులను బూడిదతో కలిపి గానీ, వేపాకు కలిపి గానీ నిల్వ చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టాలి. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కంది పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు.