దేవరకొండ రూరల్, మార్చి 06 : ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి వృత్తి పన్నులు వసూలు చేయాలని తెలంగాణ పాఠశాలల విద్యాశాఖ ఆదేశించడం విడ్డురంగా ఉందని, బేషరతుగా ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని లేకుంటే ప్రైవేట్ టీచర్లు ఏకమై పన్ను వ్యతిరేక, ప్రభుత్వ పనితీరును తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు ఎండీ. రంజాన్ బేగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయులని కానీ సిబ్బందిని కానీ ఎప్పుడూ పట్టించుకోని ప్రభుత్వం వారికి పీఎఫ్, హెల్త్ కార్డు విషయం, పని వేళలను గానీ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. భయానక కొవిడ్ కాలంలో తీవ్రంగా ఉద్యమిస్తే రెండు నెలలు రేషన్ బియ్యం, ఒక నెల రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు వెల్లడించారు. ఆ రెండు సంవత్సరాలు ప్రైవేట్ టీచర్లు ఎంత దయనీయంగా బతుకులు వెళ్లదీశారో తెలిసిందేనన్నారు. నాడు వారిని ఆదుకోని ప్రభుత్వం టీచర్ల సంక్షేమం గాలికి వదిలి వృత్తిపన్ను కట్టమనడం దుర్మార్గమైనది అని తీవ్రంగా ఖండించారు.