కోదాడ, ఫిబ్రవరి 4 : ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ ఎడమ కాల్వ నుంచి వరుసగా 18 పంటలకు సాగునీరు అందించారు. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీలో నీరు ఉన్నా పంటలు ఎండిపోకుండా కాపాడారు. కృష్ణా జలాలలో మన వాటా ఏపీకి చుక్క నీరు కూడా వదల లేదు. కేసీఆర్ కేంద్ర మెడలు వంచి కృష్ణా జలాలలో వాటాను రప్పిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల పంపిణీని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించి అన్నదాతలను మోసం చేస్తున్నది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కోదాడలో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల కృష్ణా జలాల ట్రిబ్యునల్ వివాదం ప్రధాని మోదీ తీర్చడానికి తొమ్మిదేండ్లకుపైగా పట్టిందన్నారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా జలాల వాటాను ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాలు చూసుకుంటాయని, కేంద్రం తలదూర్చవద్దని కరాఖండిగా చెప్పారని పేర్కొన్నారు. ఎడమ కాల్వ రైతులకు అన్యాయం చేసి, పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ కోదాడ నుంచే హాలియా వరకు పాదయాత్ర నిర్వహిస్తే తలొగ్గిన అప్పటి ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని గుర్తుచేశారు.
గత పదేండ్లలో సాగు, తాగునీటితోపాటు 24 గంటల విద్యుత్ను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేతకాని తనం బట్టబయలు అయిందని విమర్శించారు. ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఎడమ కాల్వ రైతుల బతుకులను ప్రశ్నార్థకం చేస్తున్న కేఆర్ఎంబీని నిరసిస్తూ రైతాంగం ఉద్యమించాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయని, అందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అని, నిర్వీర్యంగా సాగుతున్న కాంగ్రెస్ పాలనను అర్థం చేసుకుంటున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించటం ఖాయమని స్పష్టం చేశారు.
రైతుబంధు డబ్బులు అందలేదని ప్రశ్నిస్తే చెప్పుతో కొట్టాలని మంత్రులు సైతం నానా దుర్భాషలాడుతున్నారని, కాంగ్రెస్ను గెలిపించింది చెప్పులతో కొట్టించుకోవటానికా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారు ఓట్లు అడిగితే లక్ష చెప్పులతో సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు లంకెల బిందెలు లేవనడం వారి చేతకాని పాలనకు నిదర్శనమని, దొంగలే లంకెల బిందెల కోసం వెతుకుతారని ఎద్దేవా చేశారు. వైఎస్, చంద్రబాబుల కుట్రలను ఛేదించి రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్ది అని, ఆయనపై అవాకులు, చవాకులు పేలితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చేతనైతే ఆరు గ్యారెంటీలతో పాటు 414 హామీలు నెరవేర్చాలని సవాలు విసిరారు.
ఎంతకాలం బీఆర్ఎస్ నాయకులు విమర్శించి కాలం వెల్లబుచ్చుతారని విమర్శించారు. కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించటంపై జిల్లా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ గెలుపోటములు సహజమేనని పార్టీ పునఃనిర్మాణానికి దృష్టి సారించాలని శ్రేణులకు సూచించారు. ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోని నంబర్వన్గా నిలిపారని కొనియాడారు. కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ అమలు కాని వాగ్ధానాలు చేసిన కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేశారని, ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓటమిపై కూలంరషంగా చర్చించి భవిష్యతులో పార్టీ నిర్మాణం పై దృష్టి సారిద్దామని తెలిపారు. అధికార మత్తుతో తమ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేంది లేదన్నారు. ఈ సమావేశంలో నడిగూడెం ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, నాయకులు సత్యబాబు, సుంకరి అజయ్కుమార్, తొగరు రమేశ్, పచ్చిపాల వేణుయాదవ్, నాగరాజు, వెంపటి మధు, మామిడి రామారావు, బెజవాడ శ్రావణ్, షఫీ, శీలం సైదులు, లింగారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ బాధ్యులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.