– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమళ్ల వెంకటేశం
రామగిరి, ఆగస్టు 21 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించినప్పటికి నల్లగొండ జిల్లాలో మాత్రం ఇప్పుటి వరకు 124 పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్స్, ఆయాలను నియమక చేయకపోవడం సరియైనది కాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిజియూటిఎఫ్) నల్లగొండ జిల్లా కమిటి ఆవేదన వ్యక్తం చేసింది. వీటిని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తు ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టిజియూటిఎప్ రాష్ట్ర కార్యదర్శి పెరుమళ్ల ఆనంద్ మాట్లాడుతూ.. జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 124 ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు ఇన్స్ట్రక్టర్స్, ఆయాల నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. దీనివల్ల పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల విద్యాబోధన తీవ్రంగా ప్రభావితం అవుతోందని, ఉన్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోందని తెలిపారు. ఫలితంగా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్తూ ఆర్ధికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా నియామకాలు ఆగిపోయాయనడంలో అర్ధం లేదని, అధికారులు చట్టానికి లోబడి ప్రజల కోసం పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి మాట్లాడుతూ, తక్షణమే తగు చర్యలు తీసుకొని నియామక ప్రక్రియను పూర్తి చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటాలు చేపడతామని స్పష్టం చేశారు. నిరసన అనంతరం డీఈఓ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్రెడ్డి జిల్లా కోశాధికారి వడ్య రాజు, జిల్లా కార్యదర్శులు యాట మధుసూదన్ రెడ్డి, నాయకులు ఎడ్ల సైదులు, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాసరెడ్డి, మురళయ్య, నలపరాజు వెంకన్న, కొమరాజు సైదులు, ఆడిట్ కమిటీ సభ్యులు నరసింహమూర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి నర్రా సరళ, భాను ప్రకాష్, సోషల్ మీడియా కన్వీనర్ యరనాగుల సైదులు, రాగి రాకేష్, సి. హెచ్. రవీందర్, దాసరి ప్రభాకర్, పద్మ, రమణమ్మ, సూర్య కళ, సంధ్య, రమణ, నాగయ్య తదితరులు, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు, సెలక్షన్ లిస్ట్ లో మెరిట్ లో ఉన్న అభ్యర్థులు పాల్గొన్నారు.